కావూరి సాంబశివరావుపై తెలంగాణ నేతల గుస్సా
కావూరి మాటలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బ తీసే విధంగా ఉన్నాయని రాష్ట్ర మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి విమర్శించారు. తమకు పదవులు ముఖ్యం కాదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ముఖ్యమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలను కించపరిచే విధంగా కావూరి మాట్లాడారని ఆయన విమర్శించారు. కావూరి మాటలను పెద్ద జోక్ గా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు అభివర్ణించారు. కావూరివంటి పెట్టుబడి దారులైన నాయకులు పదవుల గురించి ఆలోచిస్తారని తాము కాదని ఆయన అన్నారు. తెలంగాణ నేతకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తెలంగాణ ఉద్యమం ఆగదని తెలుగుదేశం శాసనసభ్యుడు నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. పదవులతో తెలంగాణ ఉద్యమం ఆగిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమ అని ఆయన అన్నారు.
తెలంగాణ నాయకుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురు కావడంతో కావూరి సాంబశివ రావు ఏలూరులో వివరణ ఇచ్చారు. పదవులు ఇవ్వడానికి తానెవరినని ఆయన అన్నారు. తెలంగాణ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే ఆ నాయకుడు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుని ఉండేవారని అన్నట్లు ఆయన తెలిపారు. 1956 ఒప్పందం మేరకు తెలంగాణకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే బాగుండేదని తాను అన్నట్లు ఆయన తెలిపారు.