కాంగ్రెసు తెలంగాణ నేతల ఢిల్లీ పర్యటన రద్దు

తాజా పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెసు తెలంగాణ మంత్రులు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు మధ్యాహ్నం రెండు గంటలకు అత్యవసరంగా సమావేశమవుతున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కాలపరిమితితో కూడిన నిర్దిష్ట కార్యప్రణాళికను ప్రకటించకపోతే ఈ నెల 28వ తేదీ తర్వాత ప్రజాప్రతినిధులందరూ రాజీనామాలు చేయాలని తెలంగాణ రాజకీయ జెఎసి నిర్ణయం తీసుకుంది. ఈ స్థితిలో రాజీనామాలు చేయకూడదని కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై పార్టీ అధిష్టానం నుంచి ఒత్తిడి వస్తోంది. కాగా, రాజీనామాలు చేయాల్సిందేనని తెలుగుదేశం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీల నుంచి, విద్యార్థి సంఘాల జెఎసి నుంచి కాంగ్రెసు ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ స్థితిలో తమ పరిస్థితిని వివరించేందుకు తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఢిల్లీ పర్యటనను తలపెట్టారు.
ఢిల్లీ పర్యటన రద్దయిన నేపథ్యంలో తాము అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు కాంగ్రెసు తెలంగాణ ప్రజాప్రతినిధులు రెండు గంటలకు సమావేశమవుతున్నారు. రాజీనామాలకు జెఎసిని మరింత గడువు కోరాలా, ఏం చేయాలనే అంశంపై వారు ఈ సమావేశంలో చర్చిస్తారు. నిర్దిష్ట కాలపరిమితితో కూడిన ప్రకటన చేస్తే సీమాంధ్రలో ఉద్యమాలు మళ్లీ పెరగవచ్చునని, అందువల్ల గడువు ప్రకటించడానికి సిద్ధంగా లేనట్లు పార్టీ అధిష్టానం తెలంగాణ కాంగ్రెసు నాయకులకు చెప్పినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications