బాబుకు తెలంగాణ టిడిపి నేతలు దూరం?
చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. దీంతో పార్టీ కార్యాలయంలో సీనియర్ పార్టీ నేత లాల్ జాన్ బాషా జాతీయ పతాకావిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి కోస్తాంధ్రకు చెందిన యనమల రామకృష్ణుడు, కంభంపాటి రామ్మోహన్ వంటి నేతలు హాజరయ్యారు. తెలంగాణ రాగాన్ని అందుకుని ప్రత్యేకంగా పార్టీని పెట్టిన దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకోవడాన్ని వ్యతిరేకించిన హైదరాబాదుకు చెందిన తలసాని శ్రీనివాస యాదవ్ కూడా హాజరయ్యారు.
తెలంగాణకు చెందిన కడియం శ్రీహరి, ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాష్ రెడ్డి వంటి సీనియర్ నేతలు మాత్రం పార్టీ ముఖం చూడలేదు. హైదరాబాదులో ఉండి కూడా వారు పార్టీ కార్యాలయంలోని గణతంత్ర దినోత్సవానికి హాజరు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది. వారు హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జెఎసి నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలకు హాజరై అక్కడ ప్రసంగించారు. కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి మాటల్లో చంద్రబాబుపై కాస్తా ధిక్కార స్వరం కూడా వినిపించింది. అవసరమైతే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కూడా ధిక్కరిస్తామని రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్పగా, చంద్రబాబు చెప్పాడని తాము, సోనియా చెప్పారని కాంగ్రెసు వారు మాటలు మారిస్తే ప్రజలు సహించరని కడియం శ్రీహరి చెప్పారు. దీన్ని బట్టి ప్రాధాన్యాలేవో తెలిసిపోతోంది.