తమ్ముడి హత్యలో కెఎ పాల్ పాత్రపై కూడా దర్యాప్తు
హైదరాబాద్ లోనే హత్య జరిగిందని పోలీసుల దర్యాప్తులో వెల్లడయింది. గత నెల 30న ఉదయం ఏడు గంటలకు కోటేశ్వరరావు, తయాబుద్దీన్, లకీకాంత్ రెడ్డి, కత్తి శ్రీను, విజయభాస్కర్ రెడ్డి, వెంకటరావులు హైదరాబాద్ లోని ఓల్డ్ సఫిల్ గూడలోని శీతల్ ఇంటికి వెళ్లి హత్యకు స్కెచ్ గీశారు. ఇందులో భాగంగా డేవిడ్రాజ్ను అమీర్పేట లైఫ్స్టైల్ అపార్ట్మెంట్కు రావలసిందిగా కోటేశ్వరరావు ఆహ్వానించారు. గమ్ సిటీ వ్యవహారాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై చర్చలు జరపాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం 2.30కు డేవిడ్రాజ్ తన ఇన్నోవాకారులో పార్కింగ్ ప్రాంతానికి రాగానే కోటేశ్వరరావు డేవిడ్రాజ్ చర్చలు జరిపేందుకు ఆయన కారులోనే కూర్చొన్నారు. 3.45 గంటల ప్రాంతంలో కోటేశ్వరరావు మిగతా వారికి ఫోన్ చేసి లైఫ్స్టైల్ వద్దకు రమ్మని చెప్పాడు.
4 గంటల ప్రాంతంలో కేథరిన్ శీతల్, సాల్మన్రాజ్ మినహా మిగతా నిందితులు డేవిడ్రాజ్, కోటేశ్వరరావు కూర్చొన్న కారువద్దకు వచ్చారు. కారులో కూర్చొన్న డేవిడ్ రాజ్ చేతులను కోటేశ్వరరావు వెనక్కి విరిచిపట్టుకోగా మిగతావారు చేతిరుమాలుతో ముక్కు, నోరుమూసి హత్య చేశారు. అనంతరం విషాన్ని కూడా డేవిడ్రాజ్కు ఎక్కించారు. అక్కడి నుంచి డేవిడ్రాజ్ను ఆయన కారులోనే మధ్యసీటు కింద పడేసి ఏడో నెంబర్ జాతీయరహదారిపై కర్నూలు వైపు తీసుకెళ్లారు. 30వ తేదీ రాత్రి 8గంటల సమయంలో షాద్ నగర్ వద్ద టోల్ గేట్ దాటినట్లు రికార్డు అయింది. అనంతరం అడ్డాకుల మండలం శంకలమడ్డి గ్రామపరిధిలో కారును ఆపి డ్రైవర్ సీటులో డేవిడ్రాజ్ను ఉంచి వెనక వచ్చిన మరోకారులో నిందితులు కర్నూలుకు వెళ్లిపోయారు.