బెంగాల్లో ఏం జరగబోతోంది?: అఖిలేష్ యాదవ్ జోస్యం!
సమాజ్వాదీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల నుంచి ఈవీఎంల వరకు అఖిలేష్ తనదైన శైలిలో స్పందించారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందు ఆయన కీలక అంచనా వేశారు. బెంగాల్లో దీదీ(మమతా బెనర్జీ) నాయకత్వాన్ని బీజేపీ ఓడించలేదని ఆయన స్పష్టం చేశారు. "బెంగాల్లో దీదీ గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఆమె ఉంటారు" అంటూ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. బెంగాల్ ప్రజల మద్దతు మమతా బెనర్జీకే ఉందని, అక్కడ బీజేపీ పప్పులు ఉడకవని ఆయన జోస్యం చెప్పారు.
ఈవీఎం హ్యాకింగ్పై అనుమానాలు
ప్రభుత్వం పంపుతున్న డిజాస్టర్ అలర్ట్ మెసేజ్లపై అఖిలేష్ యాదవ్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. "మొబైల్ ఫోన్ ఆఫ్ చేసి ఉన్నా కూడా అలర్ట్ మెసేజ్లు వస్తున్నాయి. టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినప్పుడు, ఈవీఎంలను హ్యాక్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం అసాధ్యమా?" అని ఆయన ప్రశ్నించారు. టెక్నాలజీని వాడుకుని బీజేపీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని అఖిలేష్ యాదవ్ అనుమానం వ్యక్తం చేశారు.

యూపీ ప్రభుత్వంపై విమర్శలు
సిద్ధార్థ్నగర్లో వాటర్ ట్యాంక్ కూలిపోయిన ఘటనపై అఖిలేష్ యాదవ్ యోగి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ప్రమాదంలో చిక్కుకున్న చిన్నారిని రక్షించిన ఆర్మీ అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆ వాటర్ ట్యాంక్ నాణ్యత లేనిదని.. బీజేపీ నేతలు దమ్ముంటే ఆ ట్యాంక్ కింద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలని సవాల్ విసిరారు. అలాగే బీజేపీ రాబోయే ఎన్నికల్లో డీజేల ద్వారా వివాదాస్పద పాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తోందని ఆరోపించారు.
విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ
డిజిటల్ విభజనను తొలగించడానికి తాము గతంలోనే ల్యాప్టాప్లు పంపిణీ చేశామని అఖిలేష్ యాదవ్ గుర్తుచేశారు. ఈ సందర్భంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆయన ల్యాప్టాప్లు అందజేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఆడపిల్లలకు ఉచిత విద్యను తాము అందిస్తామని హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం అబద్ధాల 'సోన్ పాపిడి'ని వండి వార్చుతోందని.. నిత్యావసర ధరల పెరుగుదలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదని ఆయన విమర్శించారు.
ఎక్స్ప్రెస్వేల క్రెడిట్ మాదే!
ఉత్తరప్రదేశ్లో ఎక్స్ప్రెస్వేల నిర్మాణానికి పునాది వేసింది సమాజ్వాదీ పార్టీయేనని అఖిలేష్ యాదవ్ చెప్పుకొచ్చారు. "ఒకప్పుడు ప్రజలు కేవలం రోడ్లు కావాలని కోరుకునేవారు, కానీ మేము వారికి ఎక్స్ప్రెస్వేలను పరిచయం చేశాం" అని ఆయన అన్నారు. ఏఐ టెక్నాలజీ వల్ల ఇప్పుడు నేర్చుకోవడం సులభమైందని, అలాంటి ఆధునిక సాంకేతికతను ప్రజలకు చేరవేయడంలో ఎస్పీ ఎప్పుడూ ముందుంటుందని అఖిలేష్ యాదవ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications