వేదాద్రిలో దళితుల సంఘ బహిష్కరణ
గ్రామ సమీపంలో పవర్ ప్లాంటు వద్ద సుబాబుల్ కర్రను ట్రాక్టర్పై తరలిస్తున్న రావిరాల గ్రామానికి చెందిన ఇనుపనుర్తి శాంసన్ (ఎస్సీ), వేదాద్రి గ్రామానికి చెందిన మొవ్వ రాము (బీసీ) మధ్య ఇటీవల చిన్నపాటి వివాదం చెలరేగింది. శాంసన్ తన యజమాని రాజుకు విషయం తెలియజేయటంతో అతను తన వర్గీయులతో కలసి వేదాద్రి వచ్చి తన బంధువుల సహకారంతో మొవ్వ రాముతో గొడవపడ్డాడు. దీంతో రాము ఈ విషయాన్ని తన కులస్తులకు చెప్పటంతో వారంతా ఒక తాటిపై నిలిచి ఎస్సీ వర్గానికి చెందినవారిని పనులకు పిలవటం మానేశారు.
కిరాణా దుకాణాల్లో సరకులు అందకుండా చేస్తున్నారు. అంతేగాక ఎస్సీలను కట్టడి చేస్తున్నామని, హోటళ్లు, కిరాణా దుకాణాలకు, పనులకు రావద్దని గ్రామనౌకరుతో వారికి వర్తమానం కూడా పంపారు. దీంతో వివాదం ముదిరి పాకానపడింది. ఎస్సీలు ఆదివారం నందిగామకు వచ్చి ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీనికి స్పందించిన ఆయన దీనిపై విచారణ జరిపించాలని డీఎస్పీని కోరారు.
రెవెన్యూ, పోలీస్ అధికారుల విచారణ సోమవారం రాత్రి డీఎస్పీ సాంబయ్య, తహశీల్దార్ మట్టా రాంబాబు వేదాద్రి వెళ్లి ఇరు వర్గాల వారితో చర్చించారు. ఎస్సీలు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించగా, బీసీలు కూడా తమకు ఎదురైన ఇబ్బందులను తెలిపారు. ఈ విషయమై తాము తగిన నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు గ్రామస్తులు సుహృద్భావ వాతావరణంలో కలసిమెలసి ఉండాలని ఇరు వర్గాల వారికీ వారు నచ్చ చెప్పారు. ఈ మేరకు గ్రామంలో శాంతి కమిటీ ఏర్పాటుచేశారు.
ఎస్ఐల ఆధ్వర్యంలో గ్రామంలో పల్లె నిద్ర గ్రామంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా జగ్గయ్యపేట, పెనుగంచిప్రోలు, చిల్లకల్లు ఎస్ఐలతో దళితవాడలో పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టేందుకు డీఎస్పీ సాంబయ్య చర్యలు తీసుకున్నారు. దీంతో ఎస్ఐలు చంద్రశేఖర్, వెంకట నారాయణ, శివశంకర్ సోమవారం రాత్రి గ్రామంలోనే బసచేశారు.