తాతయ్యకు కన్నీటి నివాళి
నేడు.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 103వ జయంతి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు.. ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తోన్నారు. పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోన్నారు. ఏపీలో అధికార తెలుగుదేశం పార్టీ మహానాడును జరుపుకొంటోంది. మహానాడు రెండవ రోజు ప్రతినిధులు సభ జరుగనుంది. తొలి రోజైన బుధవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానాలను నేడు సభ ఆమోదించనుంది.
ఎన్టీఆర్ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రముఖ నటుడు, ఆయన మనవడు జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించారు. ఈ ఉదయం హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ ను సందర్శించారు. సమాధిపై పూలమాలలు ఉంచి నివాళి అర్పించారు. తాతయ్యను స్మరించుకున్నారు. ప్రతి సంవత్సరం మే 28వ తేదీన ఎన్టీఆర్ జయంతి, జనవరి 18వ తేదీన వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ తో పాటు కల్యాణ్ రామ్ కూడా ఘాట్ ను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది.

మరికొద్దిసేపట్లో ఏపీ మంత్రి నారా లోకేష్, ఎన్టీఆర్ తనయుడు, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి.. తదితరులు ఘాట్ కు రానున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘాట్ ను అలంకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఇక్కడికి రానున్నందున బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు పోలీస్ సిబ్బందిని నియమించారు. వాహనాల రాకపోకలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications