నాపై బాబుతో విచారణ జరపించండి: సిఎం
అవినీతి గురించి జీరో అవర్ లో ప్రస్తావించవద్దంటే మానుకుంటానని, దేశ రాజకీయాలనే మలుపు తిప్పిన బోఫోర్స్ కుంభకోణంపై పార్లమెంటులో జీరో అవర్ లోనే చర్చ జరిగిందని తెలుగుదేశం సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. చీరాల నుంచి గతంలో ముఖ్యమంత్రి కె రోశయ్య ప్రాతినిధ్యం వహించారని, ముఖ్యమంత్రి పేరును వాడుకుంటూ ఆ నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. తనపై వచ్చిన ఆరోపణలతో పాటు మంత్రులపై ఆరోపణల మీద కూడా విచారణ జరిపిస్తామంటే అందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతిపక్ష తెలుగుదేశం సభ్యుల తీరపై ప్రభుత్వ చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క తీవ్ర అభ్యంతరం చెప్పారు.
అంతకు ముందు రోశయ్య జోక్యం చేసుకుంటూ - సమస్యలపై చర్చ నుంచి తాము పోరిపోమని, నిబంధనల ప్రకారం వస్తే తాము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీకి స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుందని, స్పీకర్ కూడా ప్రతిపక్షానికే ప్రాధాన్యం ఇస్తారని ఆయన అన్నారు. స్పీకర్ అనుమతి తీసుకుని వస్తే ఆమంచి కృష్ణమోహన్ పై వచ్చిన ఆరోపణల మీద చర్చకు సిద్ధంగా ఉన్నామని, కృష్ణమోహన్ కూడా తన వాదనను వినిపించుకుంటారని ఆయన అన్నారు. సభ స్థాయి పెంచుకోవడానికి సహకరించాలని ఆయన కోరారు. అయితే రోశయ్య మాటలతో సభ సద్దుమణగలేదు. మరింత సభ వేడెక్కి సవాళ్లకు, ప్రతిసవాళ్లకు దారి తీసింది.