వైష్ణవి హత్య కేసులో దర్యాప్తు నత్తనడక
గుంటూరు ఆటోనగర్ నుంచి సేకరించిన వైష్ణవి మృతదేహం బూడిద, ఎముకలను పరీక్ష కోసం హైదరాబాద్కు తీసుకెళ్ళారు. బోన్మ్యారో ఆధారంగా డీఎన్ఏ పరీక్షించి మృతదేహం వైష్ణవిదేనని నిర్ధారించాల్సి ఉంది. ఇందులోను నెల రోజులైనా ఇంకా ఎలాంటి కదలికా లేదు. మరో వారం పది రోజులు తప్పేటట్టు కనిపించడం లేదు.
మొదట్లో హడావుడి చేసిన పోలీసులు ఇప్పుడు ఆ వేడిని తగ్గించేశారు. హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి నగరానికి వచ్చినప్పుడు పోలీసులు బాగానే చేస్తున్నారని, త్వరలోనే కేసు దర్యాప్తు ముగిస్తారని చెప్పుకొచ్చారు. మొదట్లోని ఒకటి రెండ్రోజులు చేసిన ప్రయత్నం తప్పా, కొత్తగా పోలీసులు సాధించింది ఏమీ లేదనే చెప్పాలి. కిందిస్థాయి పోలీసు అధికారులని ప్రశ్నిస్తే, పూర్తిగా కుటుంబ గొడవ ఏం చేస్తామంటూ చెప్పుకొస్తున్నారు. మరోవైపు వైష్ణవి తల్లి నర్మదాదేవి పలుమార్లు పోలీసు అధికారుల కలిసి నిందితులను శిక్షించాలని కోరారు. ప్రాణభయం ఉందని చెప్పారు. దీనిపై తీసుకుంటున్న చర్యలేమిటో కూడా పోలీసులు వెల్లడించడం లేదు.