స్వామి ఆశ్రమాలపై అధికారుల దాడులు
ఈ సందర్భంలో నిత్యానంద ధ్యాన మందిరంలో పులిచర్మాలు, 80 కేజీల గంధపు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా గీతాంజలి మాట్లాడుతూ ఆశ్రమంలో స్వాధీనం చేసుకున్న గంధపు చెక్కల చెట్లు నరికి తీసుకువచ్చారని, యాగం చేయడానికి చిన్నచిన్న గంధం చెక్కలు ఉపయోగిస్తున్నారని, ఇక్కడున్న గంధం చెక్కలు తుండ్లుగా వున్నాయని స్పష్టం చేశారు. దర్యాప్తు జరిపి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గీతాంజలి తెలిపారు.
బుధవారం ఉదయం నిత్యానంద స్వామి రాసలీలలు అంటు ఎలక్ట్రానిక్ మీడియాలో పదేపదే క్లిప్పింగ్లు చూపించారు. బిడది సమీపంలో సుమారు 80 ఎకరాల స్థలంలో నిత్యానంద ఆశ్ర మం వుంది. దేశంలోని వేలాది ఆశ్రమాలు, విదేశాల్లోని ఆశ్రమాల పరిపాలన ఇక్కడి నుంచి జరుగుతున్నది. విషయం తెలుసుకున్న స్థానికులు, కొందరు భక్తులు ఆశ్రమం దగ్గరకు చేరుకున్నారు. అప్పటికే ఆశ్రమం ప్రధాన గేట్లకు తాళాలు వేయడంతో స్థానికులు అక్కడున్న స్వామిజీ కటౌట్ లు, బ్యానర్లు, ఫ్లెక్సీ బోర్డులు చింపి నిప్పంటించారు. బెంగళూరు-మైసూరు రోడ్డులో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ బోర్డులను ధ్వంసం చేశారు. ఆశ్రమానికి చెందిన భవనాలు, క్వార్టర్స్లపై దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. స్వామిజీ చిత్రపటాలను చెప్పులతో కొట్టారు.