ఆశ్రమంపై దాడి కేసు, 12 మంది అరెస్టు
అనంతరం అటవీ శాఖ అధికారులు ఆశ్రమంలో సోదాలుచేసి పులి చర్మాలు, గంధం చెక్కలు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నిత్యానంద ఆశ్రమం చిన్న (జూనియర్) స్వామి సచ్చిదానంద, నిత్యానంద అంగరక్షకుడు నటేష్లపై అటవీశాఖ అధికారి గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం ఆశ్రమం దగ్గర పరిస్థితి అదుపులో వుంది. ఆశ్రమ పరిసర ప్రాంతాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆశ్రమ ఆవరణ లో విదేశీయులు, చికిత్స పొందుతున్న వారు అధిక సంఖ్యలో వుండటంతో పోలీసులు గట్టి నిఘా వేశారు.
ఆశ్రమంలో పలు కుటీరాలున్నాయి. బయట నుంచి చూస్తే గుడిసెలు లాగా కనిపిస్తాయి. లోపల చూస్తే విలాసవంతమైన సోఫాసెట్లు, బెడ్లు, కుర్చీలు, ఫర్నీచర్ వుంది. స్టార్ హోటల్లో వుండే సదుపాయాలు వున్నాయి. అదేవిధంగా ఆశ్రమంలో వుండటానికి, పనిచేయడానికి తమకు అవకాశం కల్పించడం లేదని, విదేశీయులకు, ఇతర రాష్ట్రాల వారికి అధిక ప్రాధాన్యమిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
నిత్యానందస్వామి ఆశ్రమాన్ని 24 గంటల్లోపు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని జయ కర్ణాటక, కన్నడ రక్షణా వేదిక సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వెంటనే నిత్యా 'ఆనంద' రాసలీలలపై స్పందించి ఆశ్రమానికి చెందిన ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని, లేదంటే తాము ఆశ్రమంలో చొరబడి ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని, అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ సంఘాల నాయకులు హెచ్చరించారు.