మళ్లీ ఆమరణ దీక్ష చేస్తా: కెసిఆర్
రాజీనామా చేసిన తెరాస శాసనసభ్యులు ఉప ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేస్తే తాము బలపరుస్తామని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ చేసిన ప్రకటనపై కెసిఆర్ తీవ్రంగా మండిపడ్డారు. ఉప ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను అయోమయానికి గురి చేయడానికి కొన్ని గుంటనక్కలు బయలు దేరాయని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో మాట్లాడి తెలంగాణపై స్పష్టమైన ప్రకటన చేయించి, పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిల్లు ప్రతిపాదించాలని, అప్పుడు తమ పార్టీ శాసనసభ్యులు రాజీనామాలు చేసిన పది స్థానాల్లో కాకుండా తాను, విజయశాంతి కూడా పార్లమెంటు స్థానాలకు రాజీనామాలు చేసి ఆ మొత్తం స్థానాల్లో కాంగ్రెసు అభ్యర్థులను గెలిపిస్తామని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవిపై కూడా ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.