Shishu Maapan: ఆశా వర్కర్ల చేతికి సరికొత్త అస్త్రం! పసి ప్రాణం సేఫ్..
నవజాత శిశువుల ఆరోగ్య ప్రమాణాల (హెల్త్ స్టాండర్డ్స్) గుర్తింపునకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త విప్లవాత్మక సాంకేతికతను తీసుకురాబోతోంది. శిశువులను తాకాల్సిన అవసరం లేకుండానే, కేవలం మొబైల్ వీడియో ద్వారా వారి బరువు, ఎత్తు, తల, ఛాతీ చుట్టుకొలతలను ఆటోమేటిగ్గా నమోదు చేసే ఏఐ ఆధారిత సేవలను వినియోగించబోతున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 'వాద్వానీ-ఏఐ' సంస్థ రూపొందించిన ఈ 'శిశు మాపన్ యాప్'ను దైనందిన విధుల్లో భాగంగా ఆశాలు ఉపయోగించే అధికారిక యాప్లోనే అనుసంధానం చేయనున్నారు.
మోయలేని బరువుల నుంచి ఆశాలకు విముక్తి!
ప్రస్తుత నిబంధనల ప్రకారం.. శిశువు పుట్టినప్పటి నుంచి 42 రోజుల్లోగా (పుట్టిన రోజు కాకుండా) మొత్తం ఆరుసార్లు (3, 7, 14, 21, 28, 42వ రోజుల్లో) ఆశాలు వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం వారు వెయింగ్ మిషన్, ఇన్ఫాంటో మీటర్, టేపుల వంటి బరువైన సామాగ్రిని మోస్తూ ఇళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఒక్కో ఇంటి వద్ద కనీసం 10 నుండి 15 నిమిషాల సమయం పట్టడమే కాకుండా, కొలతలు తీసుకునేటప్పుడు శిశువులు సహకరించక తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొత్త ఏఐ టెక్నాలజీతో ఈ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం దొరకనుంది. శిశువు దగ్గర మొబైల్ ఉంచి చిన్న వీడియో తీస్తే చాలు.. అత్యంత తక్కువ వ్యవధిలో అన్ని నిర్దేశిత ప్రమాణాలు ఆటోమేటిగ్గా నమోదైపోతాయి.

'వెయ్యి మంది శిశువుల'తో పైలట్ ప్రాజెక్ట్
ఒక్కో రాష్ట్రంలో శిశువుల శరీరతత్త్వం ఒక్కోలా ఉంటుంది కాబట్టి, ఈ వ్యవస్థను పకడ్బందీగా రూపొందించేందుకు సుమారు 1,000 మంది నవజాత శిశువుల వీడియోల డేటా బేస్ను ఏఐకి వైద్య ఆరోగ్య శాఖ అందించబోతోంది. ఇందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని ఇందిరానగర్, కొప్పురావు కాలనీ, కాజా, ఎర్రబాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు పెదవడ్లపూడి పీహెచ్సీ పరిధిలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టారు.
ఈ ప్రాంతాల్లోని ఆశాలు, ఏఎన్ఎంలకు దశల వారీగా శిక్షణ ఇచ్చి, ఫీల్డ్లో వీడియోలు తీసే ప్రక్రియను శుక్రవారం నుంచే ప్రారంభించారు. ఇక్కడి ఫలితాలను బట్టి ఈ ఏఐ సేవలను రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తారు. ఈ డేటా బేస్ తయారీ మరియు యాప్ ఇంటిగ్రేషన్ పూర్తి కావడానికి సుమారు మూడు నెలల సమయం పడుతుందని మంత్రి తెలిపారు.
లోపాలు ఉంటే వెంటనే 'మెడికల్ ఆఫీసర్కు అలర్ట్'
మొబైల్ వీడియోల ద్వారా సేకరించే ఈ వివరాల ఖచ్చితత్వంలో ఎలాంటి సమస్యలు లేవని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి. వీరపాండియన్ స్పష్టం చేశారు. "శిశు మాపన్ యాప్ ద్వారా చాలా తక్కువ సమయంలోనే నవజాత శిశువుల ఎదుగుదలలో ఏవైనా లోపాలు ఉంటే తెలిసిపోతాయి. అలా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత ప్రాంత మెడికల్ ఆఫీసర్లకు మొబైల్ ద్వారా 'అలర్ట్' వెళ్తుంది" అని ఆయన వివరించారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో ఉన్న శిశువులకు తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందుతాయని, ఈ ఏఐ సేవల ద్వారా ప్రజలకు మరింత నాణ్యమైన, నమ్మకమైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.














Click it and Unblock the Notifications