కారంచేడులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ ఏర్పాట్లు
ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. కార్యక్రమ ఏర్పాట్లను ఎమ్మెల్యే దగ్గుబాటి పర్యవేక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శ్రీకృష్ణుడు అనగానే ఎన్టీఆర్ గుర్తుకొస్తారని, ఆ రూపంలో ఆయన విగ్రహాన్ని రూపొందించామని చెప్పారు. ఎనిమిది అడుగులు కాంస్య విగ్రహాన్ని నిర్మించామన్నారు. ఈ విగ్రహావిష్కరణకు నందమూరి కుటుంబ సభ్యులందర్నీ ఆహ్వానించామని, అందరూ అంగీకరించారని చెప్పారు. ఆరు నెలల నుంచి ఎన్టీఆర్ జయంతి రోజున ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలుపెట్టామన్నారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయాలకతీతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమానికి హాజరు కానున్న ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుం టారు. అక్కడ నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓల్వో బస్సులో ఇంకొల్లులోని దగ్గుబాటి చెంచురామయ్య మెమోరియల్ ప్రాంగణానికి చేరుకుంటారు. అక్కడ రూ.2.50 కోట్లతో నిర్మిస్తున్న నందమూరి బసవతారకం బాలికల వసతి గృహాన్ని ప్రారంభిస్తారు. రూ.50 లక్షలతో నిర్మిస్తున్న స్మార్ట్ క్లాసుల గదులను, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మసీ, పీజీ కళాశాలల భవనాలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత కారంచేడు చేరుకుంటారు. మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దగ్గుబాటి చెంచురామయ్య కాంస్య విగ్రహాన్ని ప్రారంభిస్తారు.
అక్కడ నుంచి చిన్న వంతెన సెంటర్ కు చేరుకొని కుటుంబ సభ్యులందరి చేతుల మీదుగా ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఎన్టీఆర్ అభిమాన సంఘ నాయకులు రానున్నారు. వీరందర్నీ దగ్గుబాటి దంపతులు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఘనంగా సత్కరించనున్నారు.ఈ సందర్భంగా దగ్గుబాటికి చెందిన మిక్ ఎలక్ట్రానిక్స్ తెరపై ఎన్టీఆర్ జీవితానికి చెందిన ముఖ్య ఘట్టాలను ప్రదర్శించనున్నారు. చీరాల డీఎస్పీ ఎం.సుందరరావు, ఇంకొల్లు సీఐ రాయపాటి శ్రీనివాసరావు, స్థానిక ఎస్సై సయ్యద్ జిలానీలతో బందోబస్తు విషయమై దగ్గుబాటి సమీక్షించారు.