వైయస్ జగన్ యాత్రపై మీడియా మీద సిఎం రోశయ్య రుసరుసలు
బిజెపి నేత సుష్మా స్వరాజ్ సభకు, తెలంగాణ విద్యార్థుల సభకు అనుమతి ఇవ్వని ప్రభుత్వం జగన్ యాత్రకు ఎలా అనుమతి ఇచ్చిందని అడిగినప్పుడు ఆయన కాస్తా చిరాకు పడ్డారు. పరిస్థితి వేరని, తెలంగాణ విద్యార్థులు తమ కార్యక్రమాలకు పోలీసుల అనుమతి అడిగారని, పోలీసులు అనుమతి నిరాకరించారని, జగన్ అనుమతి అడగలేదని ఆయన చెప్పారు. అనుమతి ఇవ్వాలని అడగడమే తప్పా అని ఓ మీడియా ప్రతినిధి అడిగినప్పుడు ఆయన మరింతగా చిరాకు పడ్డారు. నేను అలా అన్నానా, అలా అనలేదు, అనని విషయాన్ని నాకు అంటగడతారేమిటని ఆయన అన్నారు. జగన్ అనుమతి ఇవ్వాలని అడిగితే ఏం చేస్తారని అడగాలని ఆయన మీడియా ప్రతినిధులకు సూచించారు.
సమస్యను సర్దుబాటు చేయడానికి మీడియా ప్రతినిధులు అడగాలని ఆయన అన్నారు. తమ బాధ్యత తాము నిర్వర్తిస్తున్నామని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు సూచించామని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయని, అన్నీ తన దాకా రావని ఆయన చెప్పారు. జగన్ తెలంగాణకు రావాలనే వాళ్లున్నారు, వద్దనే వాళ్లున్నారని ఆయన అన్నారు. జగన్ తెలంగాణలో పర్యటిస్తే సమస్య తెలత్తే పరిస్థితి ఉన్నప్పుడు ఎందుకు నివారించలేకపోయారని అడిగితే ఆయన సరిగా సమాధానం ఇవ్వలేదు. జగన్ పర్యటన విషయాన్ని పార్టీ అధిష్టానం చూసుకుంటోందని, అది తన పరిధిలో లేదని చెప్పారు. ఆర్కియాలజీ శాఖను సంప్రదించి శ్రీకాళహస్తి రాజగోపురాన్ని పునర్నించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు.