తల్లికి వందనం అప్డేట్: వారి ఖాతాల్లోని డబ్బులు పడేది అప్పుడే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1వ తరగతి నుండి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీలలో చదివే విద్యార్థులకు తల్లికి వందనం అందిస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థుల చదువులను ప్రోత్సహించేందుకు ఈ పథకం ద్వారా 13 వేల రూపాయలను వాటి ఖాతాలో జమ చేస్తుంది. ఈ క్రమంలో 'తల్లికి వందనం' పథకంపై ఏపీ సర్కార్ మరో కీలక అప్డేట్ ఇచ్చింది.
కొత్తగా తల్లికి వందనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి అప్పటిదాకా గడువు
ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా ఒకటో తరగతి, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్థుల తల్లులు దరఖాస్తు చేసుకోవడానికి గడువును ఆగస్టు 25వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే తల్లికి వందనం పథకంలో లబ్ది జరగని వారు, గతంలో వివిధ కారణాల వల్ల పథకం ప్రయోజనం పొందలేకపోయిన వారి దరఖాస్తుల స్వీకరణ ఆగస్టు 7తో ముగిసింది.

అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అప్పుడే
కొత్తగా చేరిన విద్యార్థులను కూడా పథకం పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. ఈ క్రమంలో దరఖాస్తులు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హుల జాబితా సిద్ధం చేస్తారు. ఆ తర్వాత ఆగస్టు 30వ తేదీన అర్హత సాధించిన ప్రతి విద్యార్థి తల్లి బ్యాంకు ఖాతాలో నేరుగా రూ.13,000 చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది.
ఆగస్టు 25లోపు వివరాలు నమోదు చేసుకోవాలన్న అధికారులు
ఈ సాయం పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర విద్యా అవసరాలకు ఉపయోగపడుతుందని తల్లులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు ఆగస్టు 25లోపు వివరాలు నమోదు చేసుకొని, 30న అందే ఆర్థిక సహాయాన్ని పొందాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పథకం ద్వారా విద్యార్థుల చదువుకు ఆర్థిక భరోసా కల్పించి, తల్లులకు సాయం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఎవరికీ ఇబ్బంది లేకుండా తల్లికి వందనం
మొత్తంగా తల్లికి వందనం నిధులను విద్యార్థులకు ఇవ్వటం ద్వారా తల్లిదండ్రులపై విద్యార్థుల చదువుల ఆర్ధిక భారాన్ని తగ్గించి ప్రభుత్వం ఆదుకుంటున్నట్టు స్పష్టంగా అర్ధం అవుతుంది. అర్హులు అయిన ఎవరికీ ఈ పథకం అందకుండా ఇబ్బంది కలగవద్దు అని భావిస్తున్న క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. మరి కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు ఈ నెల 25 వ తేదీలోగా చేసుకోవాలి.



Click it and Unblock the Notifications