ప్రేమ జంటను రాళ్ళతో కొట్టి చంపిన అగ్ర కులస్ధులు
కృష్ణాజివాడి గ్రామానికి చెందిన శేర్ బద్దం బాల్ రెడ్డి కూతురు స్వప్న (20) అదే గ్రామానికి చెందిన సుంకరి శ్రీనివాస్(28)ను ప్రేమించి మూడు నెలల క్రితం పెళ్లి చేసుకుంది. అయితే వారం రోజుల క్రితం గ్రామానికి వచ్చిన దంపతులు శ్రీనివాస్ ఇంట్లోనే ఉంటున్నారు. అయితే దళిత కులానికి చెందిన వ్యక్తిని వివాహం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేకపోయిన స్వప్న బంధువులు బుధవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశారు.
శ్రీనివాస్, స్వప్నలను పట్టుకుని రోడ్డుపైకి ఈడ్చుకువచ్చారు. దాడి నుంచి తప్పించుకుని పక్క ఇంటిలోకి దూరినా...వెంటపడి తిరిగి రోడ్డుపైకి తీసుకువచ్చి పెద్దపెద్ద బండరాళ్లతో తలలపై మోదారు. దీంతో తలలు పగిలిపోయి ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతుడు శ్రీనివాస్కు గతంలోనే వివాహమై, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య సావిత్రి, కూతుళ్లు హారిక, నందినిల కళ్లెదుటే శ్రీనివాస్ను కొట్టుకుంటూ తీసుకెళ్లి చంపారు. మృతుడి బంధువులు సంఘటనా స్థలంలో రోదిస్తూ కనిపించారు.
శ్రీనివాస్, స్వప్నలపై దాడి చేసి హతమార్చిన సంఘటనలో 70 మంది వరకు పాల్గొన్నట్టు మృతుని అన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులు ఇళ్లకు తాళాలు వేసి పరారైనట్టు సమాచారం. సంఘటనా స్థలాన్ని కామారెడ్డి డీఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, సీఐ జైపాల్ రెడ్డి, ఎస్సైలు సతీష్, విజయ్కుమార్లు సందర్శించారు.