జగన్ తెలంగాణ యాత్రకు బ్రేక్ లు వేసిన హైకమాండ్
జగన్ ఓదార్పు యాత్రకు అధిష్టానం అనుమతి సాధించేందుకు రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచందర్ రావు తీవ్ర ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. పర్యటన వద్దంటే రాష్ట్రంలోని తెలంగాణేతర ప్రాంతాల ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, తెలంగాణవాదులు మరింత రెచ్చిపోయే ప్రమాదముందని చెప్పినట్లు తెలిసింది. అయినప్పటికీ ఓదార్పుయాత్రకు అధిష్ఠానం అంగీకరించలేదు. శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు తర్వాత తెలంగాణలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్న తరుణంలో భావోద్వేగాలను రెచ్చగొట్టడం మంచిది కాదని మొయిలీ అభిప్రాయపడినట్లు చెబుతున్నారు. మొండిపట్టుకు పోవడం వల్ల పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్న యోచనలో అధిష్ఠానం ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ఒకటి రెండు నెలల్లో తెలంగాణలోని 12 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు జరుగనున్నందున ఆ ప్రాంత మనోభావాలను గౌరవించకుండా జగన్ యాత్ర చేస్తే ప్రజలను రెచ్చిగొట్టినట్లవుతుందని ఢిల్లీ కాంగ్రెసు పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం.