అల్లు అరవింద్ కు రాజ్యసభ టికెట్ ఇవ్వం: చిరంజీవి
రాజ్యసభ ఎన్నికల్లో తమఅభ్యర్థికి మద్దతివ్వమని కాంగ్రెస్ని అడగాలని ప్రజారాజ్యం రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) నిర్ణయించింది. ఒకవేళ కాంగ్రెస్కున్న అంతర్గత ఇబ్బందులతో తమకు మద్దతిచ్చే పరిస్థితి లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో అవగాహనతో వ్యవహరించాలని పార్టీ సమావేశం అభిప్రాయపడింది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్కుండే ఇబ్బందుల దృష్ట్యా తమకు మద్దతివ్వలేని స్థితి ఏర్పడితే రాజ్యసభ కోసం గట్టిగా పట్టుబట్టరాదని కొందరు సీనియర్ నేతలు సూచించారు.
రాజ్యసభ ఎన్నికల్లో సొంతంగా గెలిచే బలం లేనందున భావసారుప్య పార్టీలతో పొత్తులకు సిద్ధమని తాము ప్రకటించిన మేరకే కాంగ్రెస్ స్పందించిందని ప్రజారాజ్యం పార్టీ స్పష్టం చేసింది. పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేతలు విలేకరులతో మాట్లాడారు. సోనియాతో జరిగే సమావేశంలో పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ హోదాను ప్రస్తావిస్తామని తెలిపారు. ఈ విషయంపై ప్రధానిని కలిసేందుకు అనుమతికోరతామన్నారు. ప్రభుత్వంలో చేరమని సోనియా ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచిస్తామని చెప్పారు. లౌకికత్వం, సామాజికన్యాయం వంటి అంశాల్లో కాంగ్రెస్, ప్రరాపాది ఒకే విధానమని తెలిపారు.