రాజకీయం చేసినట్లు రుజువు చేస్తే రాజీనామా చేస్తా: వైయస్ జగన్
తనకు శత్రువులు చాలా మంది ఉన్నారని, తనకూ అధిష్టానానికీ మధ్య కొంత మంది గోడ పెట్టాలని చూస్తున్నారని, తన మనస్సులో ఏ విధమైన కల్మషం లేదని, దేవుడు తన వైపు ఉన్నాడని, తన తండ్రి బతికే ఉన్నాడని భావిస్తున్నానని, అందువల్ల తనకు నష్టం జరగదని, వాస్తవాలను అధిష్టానానికి వివరిస్తానని, అధిష్టానం తన మాట నమ్ముతుందని భావిస్తున్నానని ఆయన అన్నారు. అధిష్టానం పెద్దలను కలిసి తనపై కల్పించిన అపోహలను తొలగించుకోవడానికి ప్రయత్నిస్తానని ఆయన అన్నారు. తన తండ్రి మరణించి 9 నెలలు అవుతోందని, ఇంకా తాను బాధిత కుటుంబాలను పరామర్శించకపోతే ఆలస్యం జరుగుతుందని ఆయన అన్నారు. తాను కాంగ్రెసులోనే ఉంటానని, అధిష్టానం తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటుందని అనుకోవడం లేదని ఆయన అన్నారు.
వరంగల్ జిల్లాలోని మహబూబాబాద్ వచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు హరీష్ రావు, ఈటెల రాజేందర్, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ వరంగల్ జిల్లాకు చెందినవారు కారని, వారు వచ్చి ప్రజలను రెచ్చగొట్టారని ఆయన అన్నారు. శాసనసభ్యురాలు కొండా సురేఖ తనకు అక్క, తల్లిలాంటిదని, మరో ఎమ్మెల్యే కవిత ఎస్టీ, తనకు చెల్లెలాంటిదని, ఎమ్మెల్సీ పద్మావతి ఎస్సీ అని, వారిపై తెలంగాణవారు దాడి చేశారని, తెలంగాణవారిపైనే వారు దాడి చేశారని ఆయన అన్నారు. తాను ఫైనాన్స్ కమిటీ సమావేశంలో పాల్గొనడానికి వచ్చానని, అధిష్టానం పెద్దల అపాయింట్ మెంటు అడిగానని, అవకాశం వస్తే అన్నీ వారికి వివరంగా చెప్తానని ఆయన అన్నారు.