గిరిజనులకు శుభవార్త.. మీ ఆరోగ్యం కోసం తెలంగాణా సర్కార్ కొత్త పాలసీ!
భద్రాద్రి కొత్తగూడెం సహా, రాష్ట్రంలోని అన్ని ట్రైబల్ ఏరియాల్లో ప్రభుత్వ హాస్పిటళ్ల అభివృద్ధికి కొత్త పాలసీని తీసుకొస్తోంది తెలంగాణా ప్రభుత్వం. ఈ విషయాన్ని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. ఐటీడీఏల పరిధిలో ఉన్న అన్ని ఏరియా హాస్పిటల్స్లో, దశలవారీగా సీటీ స్కాన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి వెల్లడించారు. ఈ ప్రాంతాల్లో జనాభా ప్రాతిపదికన కాకుండా, ప్రజలకు సమీపంలో వైద్య సేవలు అందుబాటులో ఉండేలా దూరాన్ని బట్టి హాస్పిటళ్లను అభివృద్ధి చేస్తామన్నారు.
ఆ హాస్పిటల్స్ అప్ గ్రేడ్ చేయటానికి చర్యలు
అవసరమైన చోట కొత్త సబ్ సెంటర్లు, పీహెచ్సీలను మంజూరు చేస్తామన్నారు. అవసరాన్ని బట్టి ప్రస్తుతం ఉన్న పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా హాస్పిటళ్లలను అప్గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలోని అత్యంత మారుమూల గిరిజన ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.

వర్షాకాలం సీజనల్ వ్యాధులపై అలెర్ట్
అడవులు, కొండలు, దూర ప్రాంతాలు, రవాణా సమస్యలు ప్రజలకు వైద్య సేవలు అందించడంలో అడ్డంకులు కాకూడదు అన్నారు. ఈ నేపథ్యంలోనే గత నెలలోనే ఐటీడీఏ పీవోలతో సమావేశం నిర్వహించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతాల్లో మలేరియా, డెంగీ, వైరల్ జ్వరాలు, డయేరియా వంటి సీజనల్ వ్యాధులను నియంత్రించేందుకు ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. కొత్తగూడెం జిల్లాలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ మంజూరు చేశామన్నారు.
కొత్తగూడెం జిల్లాలో డయాలసిస్ సెంటర్ల మంజూరుపై మంత్రి
సీహెచ్సీలు, ఏరియా హాస్పిటల్స్కు అనుబంధంగా అంబులెన్స్లను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జిల్లాలో ఇప్పటికే 7 డయాలసిస్ సెంటర్లు ఉండగా, కొత్తగా మరో 4 డయాలసిస్ సెంటర్లు మంజూరు చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. కేవలం 20 నిమిషాల ప్రయాణంతో పేషెంట్ డయాలసిస్ సెంటర్కు చేరుకునేలా డయాలసిస్ నెట్వర్క్ను విస్తరించామని తెలిపారు.
ఆ ప్రాంతాల్లో కొత్త సబ్ సెంటర్ లు
భద్రాచలం, అశ్వరావుపేట, ఎల్లందు సహా ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఏరియా హాస్పిటల్స్లో సీటీ స్కాన్ సేవలను దశలవారీగా అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి హామి ఇచ్చారు. ఎమ్మెల్యేలు కోరినట్టుగా కొత్తగూడెం సహా అటవీ ప్రాంతాల్లో ఉన్న అన్ని పీహెచ్సీల్లో జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పట్వారిగూడెం, అన్నపెరటిపల్లి పీహెచ్సీలను అప్గ్రేడ్ చేస్తామని, గండుగులపల్లిలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని మంత్రి హామి ఇచ్చారు.













Click it and Unblock the Notifications