తెలంగాణ ఉప ఎన్నికల్లో పోటీకి సోనియా గ్రీన్ సిగ్నల్

పార్టీ అధినేత్రితో ప్రధానంగా రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, ఉపఎన్నికల గురించి చర్చించానని డీఎస్ తెలిపారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించగానే తాను, ముఖ్యమంత్రి కలిసి అభ్యర్థులను వడపోసి అధిష్ఠానానికి కుదించిన జాబితాను పంపుతామని తెలిపారు. అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యత అధిష్ఠానానిదేనని స్పష్టం చేశారు. ఎన్నికల వ్యూహం, నినాదం గురించి అడిగినపుడు ఆయన సూటిగా సమాధానం ఇవ్వలేదు. పార్టీలో తెలంగాణ, సమైక్యాంధ్ర అనుకూలురు ఉన్నందున ఇప్పుడే ఊహించడం సమంజసం కాదన్నారు. 'ప్రచారం మొదలు కాగానే మీకే అర్థం అయిపోతుంది' అని చెప్పారు. ఎన్నికల సమయంలో పార్టీలోని తెలంగాణ, సమైక్యాంధ్ర వాదుల మధ్య ఎలా సమన్వయం సాధిస్తారని అడగ్గా, అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ అనుసరిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
నిజామాబాద్ ఎన్నికల్లో మీ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేస్తారా? అని అడగ్గా, అధిష్ఠానం నిర్ణయిస్తుందని చెప్పారు. ఎన్నికల విషయంలో కాంగ్రెస్ లో భిన్న ప్రకటనలు వెలువడడం, మరికొన్ని ఇబ్బందికర పరిణామాలపై వీరప్ప మొయిలీ ఆందోళన వ్యక్తం చేశారని డీఎస్ తెలిపారు. 'ఒకరిపై ఒకరు బురద జల్లుకోవద్దని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు నేను విజ్ఞప్తి చేస్తా. హైకమాండ్ తరఫున మీరు కూడా కఠిన సందేశాన్ని పంపించాలి' అని మొయిలీకి చెప్పానన్నారు. సీనియర్ నేతలు కూడా(జలయజ్ఞం విషయంలో) బురద జల్లుకోవడం పార్టీ ప్రతిష్ఠను దిగజారుస్తుందని హెచ్చరించారు. ఆ నేతలు గవర్నర్ను కూడా కలవనున్నారని ప్రస్తావించగా, 'చెప్పాల్సింది చెప్పా' అని డీఎస్ సమాధానం ఇచ్చారు.












Click it and Unblock the Notifications