తెలంగాణకు నేను ఎటూ కాను: ముఖ్యమంత్రి రోశయ్య
ఈ సమావేశంలో ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ''నలభై ఏళ్లుగా హైదరాబాద్లోనే ఉన్నా. హైదరాబాద్ ఓటరునే. తెలంగాణ ఏర్పాటైనా, సమైక్యాంధ్రగా ఉన్నా హైదరాబాద్లోనే ఉంటా'' ఆయన అన్నారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి దిగితే ముఖ్యమంత్రి కూడా ప్రచారానికి రావాలని కొందరు నేతలు కోరారు. తనకేమీ అభ్యంతరం లేదని, స్థానిక నేతల కోరిక, అధిష్ఠానం సూచనల మేరకు వ్యవహరిస్తానని సీఎం చెప్పారు. అంతర్గత కలహాల జోలికి వెళ్లకుంటే మెజారిటీ స్థానాలు కాంగ్రెస్వేనని ధీమా వ్యక్తం చేశారు.
గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ఆశావహులకు సూచించారు. వైఎస్ వ్యూహ చతురతను అలవరచుకోవాలని సలహా ఇచ్చారు. 2009 ఎన్నికలకు ముందు శాసనసభలో తెలంగాణకు వ్యతిరేకం కాదని చెప్పడంతోబాటు కమిటీ వేస్తానని అన్నారని ప్రస్తావించారు. మొదటిదశ పోలింగ్ ముగిశాక వైఎస్ నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్కు లాభం చేకూర్చాయని అన్నట్లు తెలిసింది. ఇది కూడా గెలుపు వ్యూహమే భాగమేనని సూత్రీకరించారు. తాను ఇప్పటికీ తెలంగాణకు కట్టుబడి ఉన్నానని డీఎస్ చెప్పారు.
కరీంనగర్ జిల్లాకు సంబంధించి హుజూరాబాద్, ధర్మారం, కోరుట్ల సెగ్మంట్లల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, శుక్రవారం సమావేశంలో వీటి చర్చ రాలేదు. మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి ఆరుగురు ఆశావహులు ఉండగా డీసీసీ నుంచి ఏకాభిప్రాయంతో ఒక్కరిపేరే సూచిస్తామని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నందీశ్వర్గౌడ్ తెలిపారు. నిజామాబాద్ జిల్లాలో రెండుచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి. నిజామాబాద్ అర్బన్ నుంచి తానే పోటీ చేస్తున్నానని డీఎస్ తెలిపారు. ఎల్లారెడ్డి నుంచి పాత అభ్యర్థి జనార్దన్ గౌడ్ వైపే నియోజకవర్గ నేతలు మొగ్గు చూపుతున్నారు. వరంగల్ పశ్చిమం నుంచి అభ్యర్థుల అంశం ప్రస్తావనకు రాలేదు.