వైయస్ జగన్ తూర్పు గోదావరి యాత్రకు విస్తృత ఏర్పాట్లు
విపక్ష నేతగా మే 15, 2003లో పాదయాత్రకు వచ్చిన సందర్భంగా అస్వస్థతకు గురైన వైఎస్ ఆరు రోజులు రాజమండ్రి మధురపూడి విమానాశ్రయానికి సమీపాన బత్తుల సత్తిరాజు తోటలో విశాంతి తీసుకున్నారు. జిల్లాలోని ప్రత్తిపాడు చేరుకోవడంతో వైఎస్ వెయ్యి కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్కు జిల్లాతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఓదార్పు యాత్రకు ఇక్కడి నుంచే శ్రీకారం చుట్టాలని తొలుత భావించారు. అయితే కారణాంతరాల వల్ల జిల్లాను మలివిడతకు మార్పు చేశారు.
జగన్ విశాఖ జిల్లా పాయకరావుపేట మీదుగా ఈనెల 11వ తేదీ ఉదయం తుని చేరుకుని ఓదార్పు యాత్రను ప్రారంభించనున్నారు. యాత్ర ప్రత్తిపాడు, రంపచోడవరం, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం, రాజానగరం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, అనపర్తి, మండపేట, రామచంద్రపురం, కొత్తపేట, అమలాపురం, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నియోజకవర్గాల మీదుగా కాకినాడ సిటీ నియోజకవర్గం వరకు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. యాత్ర రూట్ మ్యాప్ తయారీపై పీసీసీ కార్యదర్శి కె.వి.సత్యనారాయణరెడ్డి, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వరుపుల రాజా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. గురువారం ఉదయం తునిలో ప్రారంభమైన వారి తొలి రోజు పరిశీలన రాత్రి తొమ్మిది గంటలకు అనపర్తితో ముగిసింది. స్థానిక ఎమ్మెల్యే, పార్టీ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులతో చర్చించి రూట్మ్యాప్ తయారు చేస్తున్నారు.