తెలంగాణ ఉప ఎన్నికల్లో ఢిల్లీ కాంగ్రెసు చేతివాటం
గెలవడానికి అవకాశం ఉందని భావిస్తున్న నిజామాబాద్ అర్బన్, ధర్మపురి, సిరిసిల్ల, సిర్పూర్ కాగజ్ నగర్, వేములవాడలపై కాంగ్రెసు అధిష్టానం ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించింది. ఎన్నికల ప్రచార బాధ్యతను మంత్రులపై, సీనియర్ నేతలపై పెట్టింది. దీంతో రాష్ట్ర మంత్రులు తమకు అప్పగించిన నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. సీనియర్ నేత వి. హనుమంతరావు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. మరో సీనియర్ నాయకుడు కె. కేశవరావు కూడా ఒకటి రెండు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించే అవకాశం ఉందని భావిస్తున్నారు. సిడబ్ల్యుసి సభ్యుడు వెంకటస్వామి తన కుమారుడు పోటీ చేస్తున్న చెన్నూరు నియోజకవర్గంపై దృష్టి పెట్టారు.
తెలంగాణ సెంటిమెంటు ప్రధాన ఎజెండాగా జరుగుతున్న ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నుంచి విజయం సాధించడానికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెమటోడుస్తున్నారు. తామే తెలంగాణ తెస్తామంటూ హామీ ఇస్తున్నారు. తెలంగాణ రావడం ఖాయమని, తెలంగాణ ఇస్తామని సోనియా చెప్పారని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో మాటల యుద్ధానికి దిగుతున్నారు.