రోశయ్యను దింపేందుకు గాలి జనార్దన్ రెడ్డి కుట్ర?
రోశయ్యను దించడానికి గాలి సోదరులు రాష్ట్రంలో పావులు కదుపుతున్నారని ఆరోపించారు. గాలి జనార్దన్రెడ్డి అక్రమ మైనింగ్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఏదైనా చేయగలనన్న అహంకారాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. బిజెపి నేతలు సుష్మాస్వరాజ్, వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీలాంటి వారినే ప్రలోభపెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటి వ్యక్తుల పట్ల బిజెపి అప్రమత్తంగా లేకపోతే ఆ పార్టీ గాలిలో కలిసిపోవడం ఖాయమన్నారు.
కర్ణాటక ప్రభుత్వం తరహాలోనే రాష్ట్రం నుంచీ ఇనుప ఖనిజం ఎగుమతులను నిషేధించాలని ముఖ్యమంత్రిని కోరతానన్నారు. 2004 నుంచి ఇప్పటివరకూ మంజూరు చేసిన మైనింగ్ లీజుల జాబితాను బయటపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. ఆ జాబితా వెలుగులోకి వస్తే 'ప్రకృతి సంపదలో పేదలకేమైనా భాగస్వామ్యం దక్కిందా, లేక అంతా పెద్దలే భోంచేశారా' అన్న విషయం బయటపడుతుందని వీహెచ్ తెలిపారు. మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తే ఇందులో ఎవరికెంత పాత్ర ఉన్నదీ ప్రజలకు తెలుస్తుందన్నారు.