తెలంగాణ నేతల ఒత్తిడికి చంద్రబాబు నాయుడు తలొగ్గుతారా?
తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉందని, ఉప ఎన్నికల్లో కూడా ఈ విషయం స్పష్టమైందని తెదేపా తెలంగాణ ఫోరం అభిప్రాయపడింది. శ్రీకృష్ణ కమిటీకి ఈ ఉప ఎన్నికల ఫలితాలే ఒక సందేశమని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా కళ్లు తెరవాలని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని డిమాండ్ చేసింది. తాము తెలంగాణకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించింది. ఉప ఎన్నికల ఫలితాలు పార్టీకి దెబ్బ అని, అయితే రాజకీయంగా ఒక్కోసారి ఇలాంటివి తప్పవని అనుకున్నారు. తెలంగాణ ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేస్తే ఎలా ఉంటుందన్న అంశాన్ని ఒకరిద్దరు నేతలు ప్రతిపాదించారు. దీనిపై ఫోరం ఏ నిర్ణయమూ తీసుకోలేదు.
శ్రీకృష్ణ కమిటీకి లేఖ రాయిస్తే ఇక ప్రత్యేక కమిటీ అవసరం కూడా ఉండదని ఇంకొందరు అభిప్రాయపడ్డారు. ఏదేమైనా పార్టీ అధినేత, పొలిట్ బ్యూరో సభ్యులు, సీమాంధ్ర నాయకులు అందరితోనూ మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తే బాగుంటుందని అనుకున్నారు. తెలంగాణపై నిర్ణయించాల్సిది తెదేపా కాదని, ఇప్పుడు ఏమనుకున్నా ఊహాజనితమేనని, పరిస్థితిని బట్టి నిర్ణయాలు తీసుకునేందుకు అందుబాటులో ఉన్న నేతలు ఎప్పటికప్పుడు కలుస్తూ ఉండాలని నిర్ణయించారు.