స్వైన్ ఫ్లూ మహమ్మారి విజృంభన: 21 మంది మృతి
మరో బాలుడికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో అతడిని హైదరాబాద్ లోని రెయిన్ బో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రఘుపతి(30)కి లక్షణాలు కనిపించడంతో నగరంలోని గాంధీ ఆస్పత్రిలో చేరాడు. ఆయనకు వ్యాధి నిర్ధారణ కావడంతో ఇక్కడే చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కాగా గురువారం రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల నుంచి మొత్తం 59 శాంపిళ్లను సేకరించి ఐపీఎంకు పంపగా మొత్తం 18 మందికి వైరస్ సోకినట్లు తేలింది. విశాఖలో ఇద్దరికి స్వైన్ ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణైంది. ఒక్క విశాఖలోనే స్వైన్ ఫ్లూ నిర్ధారణ అయిన వారి సంఖ్య ఇప్పటి వరకూ 20కి చేరుకుంది. కాగా గాంధీ ఆస్పత్రి నర్సింగ్ స్టూడెంట్లపై అధికారులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. గాంధీ నర్సింగ్ కాలేజీకి చెందిన 150 మంది విద్యార్థుల్లో 17 మందికి గురువారం దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కనిపించాయి. దైంతో వీరిని వెంటనే గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. వారి నుంచి నమూనాలు సేకరించి ఐపీఎంకు పంపించినట్లు తెలిసింది.