తెరాస నేత కె చంద్రశేఖరరావు విమర్శలకు భయపడం: చంద్రబాబు నాయుడు
తన మాటలను తెరాస నాయకులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. తనకు రెండు ప్రాంతాలు రెండు కళ్లలాంటివని, రెండు ప్రాంతాలు తనకు సమానమేనని చెప్పానని, దాన్ని తెరాస నాయకులు వక్రీకరిస్తున్నారని ఆయన అన్నారు. ఆయా ప్రాంతాల ప్రజల మనోభావాలకు అనుగుణంగా ఆయా ప్రాంతాల నాయకులు పనిచేయడానికి తాను వెసులుబాటు కల్పించానని ఆయన చెప్పారు. తమను పోరాటం చేయవద్దని చెప్పడం తెరాసకు తగదని ఆయన అన్నారు. ఒక రాజకీయ పార్టీగా తెరాస నాయకులు అసభ్యంగా మాట్లాడడం మంచిది కాదని ఆయన అన్నారు. సున్నితమైన, జటిలమైన సమస్యపై తాము ఆచితూచి వ్యవహరిస్తున్నామని ఆయన చెప్పారు.
బాబ్లీపై కేంద్ర ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం చేస్తామని ఆయన చెప్పారు. బాబ్లీ సమస్యకు రాజకీయ పరిష్కారం చూడాల్సి ఉంటుందని ఆయన అన్నారు. బాబ్లీపై పోరాటానికి 9 మందితో కమిటీ వేశామని, ఈ కమిటీకి ఎర్రబెల్లి దయాకర రావు నేతృత్వం వహిస్తారని ఆయన చెప్పారు. బాబ్లీపై పోరాటంలో ఇతర రాజకీయ పార్టీలను, రైతు సంఘాలను కలుపుకుంటామని ఆయన చెప్పారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో పాదయాత్రలు చేస్తామని ఆయన చెప్పారు. గ్రామస్థాయి వరకు ఉద్యమాన్ని విస్తరిస్తామని ఆయన అన్నారు.