వైయస్ జగన్ ను రెచ్చగొట్టడానికే హై కమాండ్ డైరెక్షన్?
గతంలో అంబటి రాంబాబుకు షోకాజ్ నోటీసు జారీ చేసినప్పుడు తూర్పు గోదావరి జిల్లా ఓదార్పుయాత్రలో జగన్ ఉద్రిక్తతకు లోనయ్యారు. తన ఆగ్రహాన్ని ఎంతగా దిగమింగుకున్నప్పటికీ అధిష్టానానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇలా జరిగితే తాను నోరు విప్పాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఆ మాత్రానికే అంతగా రెచ్చిపోయిన జగన్ ఇద్దరు మంత్రులపై చర్యలు తీసుకుంటే తప్పకుండా అంతకన్నా ఎక్కువగా రెచ్చిపోతారని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. జగన్ పై ప్రజల్లో సానుభూతి పెరగకుండా చర్యలు తీసుకోవాలని అధిష్టానం భావిస్తుంది. అందువల్ల జాప్యం చేస్తూ వస్తోందని అంటున్నారు. మంత్రులపై చర్యలు తీసుకుంటే చేసే వ్యాఖ్యలపై ఆధారపడి జగన్ పై చర్యలు తీసుకుంటే సానుభూతి తీవ్రతను తగ్గించవచ్చునని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
జగన్ వర్గం తప్పుకున్నా రాష్ట్ర ప్రభుత్వానికి ఢోకా ఉండదనే అంచనాలో కాంగ్రెసు అధిష్టానం ఉంది. జగన్ వెంట వెళ్లిపోయే శాసనసభ్యుల జాబితా ఇప్పటికే అధిష్టానం వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు 27 మంది శాసనసభ్యులు జగన్ వెంట వెళ్లిపోతే దాన్ని భర్తీ చేసుకోవడానికి వీలైన వ్యూహాన్ని కూడా సిద్ధం చేసుకుంది. ప్రజారాజ్యం, మజ్లీస్ పార్టీల మద్దతు కాంగ్రెసుకు లభించే అవకాశం ఉంది. అవసరమైతే విశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఓటింగ్ కు దూరంగా కూడా ఉండవచ్చు. దానివల్ల రోశయ్య ప్రభుత్వం బయటపడే అవకాశాలుంటాయని భావిస్తున్నారు. కాంగ్రెసు అంతర్గత కలహాల కారణంగా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తెలుగుదేశం పార్టీ కూడా సిద్ధంగా ఉండకపోవచ్చు. పైగా, ప్రభుత్వం పడిపోయినా ఫరవా లేదు, జగన్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు లొంగకూడదనే గట్టి నిర్ణయానికే కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.