డిసెంబర్ తర్వాత భూకంపం తేద్దాం, రెడీగా ఉండండి: కెసిఆర్
ఏపీపీఎస్సీ ఛైర్మన్ సీమాంధ్ర అభ్యర్థులకు ఇంటర్వ్యూలలో ఎక్కువ మార్కులు వేసి, వారి ప్రాంతం వారికే ఉద్యోగాలు వచ్చేలా చేసుకున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణకు చెందిన చంద్రశేఖర్గౌడ్, హరితలకు రాతపరీక్షల్లో 675, 613 మార్కులు వస్తే ఇంటర్వ్యూలలో కేవలం 28, 21 మార్కులు వేశారని, అదే సీమాంధ్రకు చెందిన రవీందర్రెడ్డి, స్వాతిరెడ్డిలకు రాతపరీక్షల్లో 570, 535 మార్కులు వస్తే ఇంటర్వ్యూలో 82, 88 మార్కులు వేసి తమ పక్షపాత వైఖరిని నిరూపించుకున్నారని ఇంటర్వ్యూలకు దేశంలో ఎక్కడా ఇన్నేసి మార్కులు వేసిన దాఖలాలు లేవని ఆయన అక్రమాలను ఎత్తిచూపారు. ఇలాంటి వివక్షను గుర్తించే గ్రూప్-1 పరీక్షను వాయిదావేసి, తమ వాటా ప్రకటించాలని కోరితే ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కొత్తగా వచ్చాను కాబట్టి తడాఖా చూపించాలని డీజీపీ అనుకుంటే ముందు అక్రమాలకు పాల్పడిన ఏపీపీఎస్సీ ఛైర్మన్ వెంకట్రాంరెడ్డిని అరెస్టు చేయాలని సూచించారు.
తాజాగా 14 మంది విశ్రాంత ఇంజినీర్లు జూరాల నుంచి పాకాల వరకు కాలువ తవ్వితే మధ్యలోని నల్గొండ, వరంగల్ భూములన్నీ సస్యశ్యామలం అవుతాయని చెప్పారని పేర్కొన్నారు. ఈ కాలువ తవ్వితే ఒక్క యూనిట్ విద్యుత్ ఖర్చు లేకుండా భూములు సాగవుతాయని తెలిపారు. ''పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లను తీసుకెళితే ఎవరూ మాట్లాడరు. కనీసం మనకు రావాల్సిన నీళ్లపైనా మాట్లాడరా? మనకు హక్కులేదా?'' అని కేసీఆర్ తీవ్రంగా ప్రశ్నించారు. బాబ్లీ నాటకానికి అసలు సూత్రధారి ఎర్రబెల్లి దయాకర్రావేనని ఎన్ని నాటకాలు వేసినా ఆయనను పాలకుర్తి నియోజకవర్గం నుంచి తరిమికొట్టే రోజు ముందుందని కేసీఆర్ హెచ్చరించారు.