గ్యాంగ్ ఆఫ్ ఫోర్: కాంగ్రెసు ఎంపిలపై మంత్రుల మండిపాటు

మంత్రివర్గ సమావేశం నుంచి అధికారులు బయటికి వెళ్ళిపోయాక తొలుత వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్ ఈ విషయాన్ని పరోక్షంగా లేవనెత్తారు. మీడియాలో ఏదో ఒకటి మాట్లాడేందుకు పోటీ పడుతూ కొందరు నేతలు లేనిపోని రాద్ధాంతాలు సృష్టిస్తున్నారని అన్నారు. మంత్రులు కూడా తలో విధంగా మాట్లాడే పరిస్థితి ఇబ్బందులు సృష్టిస్తుందని పేర్కొన్నారు. అంతా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి రోశయ్య జోక్యంచేసుకుని మనమంతా ఏమైనా చిన్న పిల్లలమా? అన్నీ చెప్పాలా? అని వ్యాఖ్యానించారు. ఆ తరువాత బీసీ సంక్షేమ శాఖ మంత్రి ముఖేష్ మాట్లాడుతూ నలుగురు ఎంపీల తీరుపై నేరుగానే గురిపెట్టారు. 'గుత్తా సుఖేందర్ రెడ్డి, మంద జగన్నాథం 2009 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలోకొచ్చారు. అప్పటికి దాకా వారు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. మధుయాష్కీ 2004లో నేరుగా అమెరికా నుంచి వచ్చి పోటీచేసి ఎంపీ అయ్యారు. వివేక్ పారిశ్రామికవేత్తగా ఉంటూ 2009లో ఎంపీగా గెలిచారు. వీరిలో ఏ ఒక్కరైనా ఎంపీలు కాకముందు పార్టీ కోసం పనిచేశారా? పార్టీ జెండా పట్టారా? ఎప్పుడైనా భుజాన పెట్టుకున్నారా? కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు చేసిందేమిటి? మేమంతా పార్టీ కోసం మూడు దశాబ్దాలుగా పనిచేస్తున్నాం. జెండాలు మోశాం. ఉద్యమాలు చేశాం. ఇప్పుడు వాళ్ళే మొత్తం పార్టీ అన్నట్లు ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఏకంగా తెరాస అధ్యక్షుడు చంద్రశేఖరావుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. దీని వల్ల పార్టీ బాగా నష్టపోతోంది. దీన్ని అదుపుచేయాలి" అని ముఖేష్ అన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో పార్టీ కోసం పాటుపడిన నేతలంతా మౌనంగా ఉంటే పార్టీకి చేటు తప్పదని ఆయన వ్యాఖ్యానించారు. దామోదరం రాజనరసింహ కూడా ఆ నలుగురు ఎంపిల తీరుపై అదే తీరులో మండిపడ్డారు.












Click it and Unblock the Notifications