సోనియా మనసేమిటో తెలియక రాష్ట్ర కాంగ్రెసు నేతల తికమక
నవంబర్ రెండో తేదీన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) సమావేశం అనంతరం సంస్థాగతంగా భారీ మార్పులూ చేర్పులూ ఉంటాయని రాష్ట్ర నేతలు భావిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం సీడబ్ల్యుసీ ఏర్పాటు, ఏఐసీసీ పునర్వ్యవస్థీకరణ ఉంటాయి. అందులో భాగంగా, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి వీరప్ప మొయిలీ మారితే, పీసీసీ అధ్యక్షుని నియామకం ఉంటుందని భావిస్తున్నారు. దానికి తోడు, ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పదవుల భర్తీకి కూడా అప్పుడే అధిష్ఠానం నుంచి గ్రీన్సిగ్నల్ లభిస్తుందని చాలా మంది శాసనసభ్యులు ఆశపెట్టుకున్నారు. డిసెంబర్ 31 లోగా శ్రీకృష్ణ కమిటీ తన నివేదికని కేంద్రానికి ఇవ్వనుంది. ఆలోగానే రాష్ట్రంలో పార్టీ పరిస్థితులను చక్కదిద్దేందుకు అధిష్ఠానం నడుం బిగిస్తుందని నేతలు భావిస్తూ వచ్చారు. అయితే, హఠాత్తుగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఉదంతం తెర మీదకు వచ్చింది. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించే పనిలో అధిష్ఠానం తలమునకలయింది. దీంతో రాష్ట్రానికి సంబంధిచిన అంశాలు వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉంది.
అధిష్ఠానం పెద్దలతో మాటా మంతీ జరిపేందుకు మంత్రి దానం నాగేందర్ ఇప్పటికే ఢిల్లీ వెళ్లారు. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. సోమవారం రాష్ట్రావతరణ వేడుకల్లో పాల్గొన్న అనంతరం ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. మంత్రులూ అదే రోజు ఆయన బాటే పట్టనున్నారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాను రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ ఎన్. కిరణ్కుమార్ రెడ్డి శనివారం కలిశారు. చిత్తూరు జిల్లాలో సీఆర్పీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం పట్ల ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలిపినట్టు సమాచారం. మొత్తం మీద, రాష్ట్ర కాంగ్రెసులోనూ, ప్రభుత్వంలోనూ సంభవించే పరిణామాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.