హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ మంత్రులకు రాష్ట్రావతరణ దినోత్సవ కష్టాలు, వ్యతిరేకత

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొన్న తెలంగాణ మంత్రులు సోమవారం తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కున్నారు. తెలంగాణ జిల్లాలంతటా వారి పట్ల తీవ్ర నిరసన వ్యక్తమైంది. నిరసన కార్యక్రమాల వల్ల మంత్రులు రాష్ట్రావతరణ దినోత్సవాల్లో పాల్గొన్నామని అనిపించుకున్నారు. మహబూబ్ నగర్ లో రాష్ట్ర పౌర సరఫరాల మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కున్నారు. తెలంగాణవాదులు నల్లజెండాలు ప్రదర్శిస్తూ ఆయన కాన్వాయ్ కి అడ్డం పడ్డారు. దీంతో పోలీసులు ఆందోళనకారులను అరెస్టు చేశారు. మెదక్ జిల్లాలోనూ మంత్రి జె. గీతారెడ్డికి అదే పరిస్థితి ఎదురైంది. గీతారెడ్డిని తెలంగాణవాదులు అడుగడుగునా అడ్డుకోవడానికి ప్రయత్నించారు. గీతారెడ్డిని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యుడు హరీష్ రావు తెలంగాణద్రోహిగా అభివర్ణించారు.

ఖమ్మంలో మరో మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డికి తెలంగాణ సెగ తగిలింది. నల్లబ్యాడ్డీలు ధరించిన తెలంగాణవాదులు అవతరణ దినోత్సవ వేదిక మీదికి దూసుకురావడానికి ప్రయత్నించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు లాఠీచార్జీ చేసి ఆందోళనకారులను అరెస్టు చేశారు. మంత్రి హడావిడిగా అవతరణ దినోత్సవ కార్యక్రమాన్ని ముగించారు. నిజామాబాద్ లో తెలంగాణవాదులు నల్ల బెలూన్లు ఎగురేశారు. ఆదిలాబాద్ లో అవతరణ దినోత్సావాల్లో పాల్గొనడానికి వచ్చిన మంత్రి డికె అరుణ బస చేసిన ఆర్ అండ్ బి అతిథి గృహం ముందు ధర్నా చేశారు.

కరీంనగర్ లో మంత్రి శ్రీధర్ బాబు అవతరణ దినోత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కెసిఆర్ పై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ విమోచన కార్యక్రమాల్లో కెసిఆర్ ఎందుకు పాల్గొనలేదని ఆయన ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ జిమ్మిక్కులు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెరాస నుంచి ఎన్నికైన శాసనసభ్యులు ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెడతారా, తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెడతారా అని ఆయన అడిగారు. హైదరాబాదులోని రాష్ట్రావతరణ దినోత్సవాలు జరిగిన ఎన్టీఆర్ స్టేడియంలోకి తెలంగాణవాదులు నల్ల బెలూన్లు వదిలారు. చార్మినార్ వద్ద తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు రాష్ట్రావతరణ దినోత్సవాలకు నిరసనగా నల్ల పావురాన్ని ఎగురేశారు. తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో నల్లజెండాలను ఆవిష్కరించారు. హైదరాబాదులోని తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపం గన్ పార్కు వద్ద ఐటి ఫోరం సభ్యులు సంకెళ్లు వేసుకుని నిరసన తెలిపారు. సూర్యాపేట కాంగ్రెసు శాసనసభ్యుడు ఆర్. దామోదర్ రెడ్డి తన ఇంటిపై నల్లజెండాను ఆవిష్కరించారు. ఆయన నల్ల చొక్కా వేసుకుని నిరసన తెలిపారు. డిసెంబర్ 31 తర్వాత అంతర్యుద్ధం తప్పదని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X