డిసెంబర్ తర్వాత సీమాంధ్ర ఛానళ్లు మరింత కుట్ర చేస్తాయి: కెసిఆర్
తెలంగాణ ఎస్సైలకు ప్రభుత్వం ప్రమోన్లు ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఉపాధ్యాయ పోస్టుల్లో కూడా అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నిర్లజ్జగా తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటూ వస్తోందన్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు, కష్టాలు తీరాలంటే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావాల్సిందేనన్నారు. అందుకోసం పార్టీలకతీతంగా అందరూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ సాధన కోసం వివిధ పార్టీలనుండి ప్రజలు తెరాసలోకి భారీగా చేరుతున్నారని ఆయన అన్నారు.
కొన్ని ఛానళ్లు పని గట్టుకొని తెలంగాణకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. దిక్కుమాలిన కథనాలు ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నాయన్నారు. కట్టుకథలు, పిట్టకథలు ప్రసారం చేస్తున్నాయని అన్నారు. ఓ ఛానల్ హైదరాబాద్ కూలిపోతుందని ప్రచారం చేస్తే, మరో ఛానల్ వరంగల్ నాశనమవుతుందని పోటాపోటీగా ప్రసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. డిసెంబర్ 31 తర్వాత రాష్ట్రం ప్రశాంతంగా ఉండలనే చిత్థశుద్ధి ఉంటే ఆ ఛానళ్లు తెలంగాణకు వ్యతిరేకంగా ఎందుకు ప్రచారం చేస్తున్నాయని ఆయన ప్రశ్నించారు. మూడు నెలల వరకు సీమాంధ్ర ఛానళ్లు ఇష్టమున్నట్టు ప్రసారం చేస్తాయని అయితే ఆ తర్వాత మన ఛానల్ ఆ ఛానళ్ల గుట్టు బయట పెడుతుందని అన్నారు. ఇప్పుడు ఛానళ్లు తెలంగాణపైన దుష్ప్రచారం చేస్తున్నాయని, ఇది 31 తర్వాత మరింత ఎక్కువ అవుతుందని ఆ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.