చిరంజీవి మాట వినడానికి నిరాకరిస్తున్న వంగవీటి రాధ?
కాపులకు మాత్రమే ప్రాధాన్యం ఇస్తున్నారనే విమర్శ నుంచి తప్పించుకోవడానికి చిరంజీవి కాపులను పక్కన పెట్టి ఇతర కులాల నాయకులను చేరదీసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే వైశ్య కులానికి చెందిన వేములపల్లి శ్రీనివాస్ కు చిరంజీవి ప్రాధాన్యం ఇస్తున్నారని అంటున్నారు. ఇది రాధకు మింగుడు పడడం లేదు. అప్పట్లోనే వంగవీటి రాధ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెసు పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు.
అయితే, పార్టీ రాష్ట్ర నాయకులు చెప్పడంతో ఇప్పటి దాకా ఆగారు. మంగళవారం సాయంత్రం చిరంజీవి రాధాకృష్ణతో చర్చలు జరిపారు. ఈ చర్చలు సంతృప్తికరంగా లేవని రాధాకృష్ణ భావించినట్లు సమాచారం. పార్టీని వీడివెళ్లవద్దని చిరంజీవి రాధకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు. అయితే, ఇప్పుడు తాను ఏమీ చెప్పలేనని, తనకు కొంత సమయం కావాలని చెప్పి రాదా వచ్చేసినట్లు తెలుస్తోంది. రాధ కాంగ్రెసు పార్టీలో తిరిగి చేరడానికే నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.