రాజా ఉద్వాసనకు కాంగ్రెసు ఒత్తిడి: మొండికేస్తున్న రాజా
రాజా స్థానంలో మంత్రివర్గంలో చేర్చుకోవడానికి డిఎంకె నుంచి మరో పేరును సూచించాల్సిందిగా కరుణానిధిని కోరాలని కాంగ్రెసు నాయకత్వం నిర్ణయించుకుంది. దీనిపై కాంగ్రెసు నాయకత్వం గురువారం సుదీర్ఘంగా మంతనాలు జరిపింది. 2011 ఏప్రిల్ లో తమిళనాడు శాసనసభా ఎన్నికలు ఉన్న నేపథ్యంలో రాజా ఉద్వాసనకు కరుణానిధి విముఖంగా ఉన్నారు. అయితే, అన్నాడియంకె నేత జయలలిత మాత్రం రాజా వ్యవహారంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. రాజాకు ఉద్వాసన చెప్తే యుపిఎ ప్రభుత్వం పడిపోతుందంటే తాను ఆదుకుంటానని, యుపిఎకు మద్దతు సమీకరించి పెడతానని ఆమె కాంగ్రెసు నాయకత్వానికి చెబుతున్నారు.
అయితే, తాను రాజీనామా చేసే ప్రసక్తి లేదని రాజా కూడా మొండికేస్తున్నారు. తాను రాజీనామా చేయబోనని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. రాజా ఉద్వాసనకు కరుణానిధి అంగీకరించకపోతే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా కాంగ్రెసు నాయకత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం.