మరోసారి ఉద్రిక్తంగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయం
ఎస్ఐ రాత పరీక్షలను ఆపాలంటూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జి చేసి అరెస్టు చేయటాన్ని వారు ఖండించారు. ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని టిఎస్ఐకాస అధ్యక్షుడు రాజారాంయాదవ్, ఓయుఐకాస అధ్యక్షుడు మర్రి అనీల్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం పరీక్షలు నిర్వహించకుండా ఒత్తిడి తీసుకు రావాలని మంత్రులను, శాసనసభ్యులను వారు డిమాండ్ చేశారు. ఎస్ఐ పోస్టులపై ప్రభుత్వ స్పష్టమైన ప్రకటన చేయాలన్నారు.
కాగా ఎస్ఐ రాత పరీక్షల నిర్వహించటం, నిర్వహించక పోవటం నా చేతుల్లో లేదని డిజిపి అరవిందరావు అన్నారు. అది ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు నాగం జనార్ధనరెడ్డి, కాంగ్రెస్ మాజీ మంత్రి దామోదరరెడ్డి, తెరాస శాసనసభా పక్షనేత ఈటెల రాజేందర్ నాంపల్లిలో అరెస్టయిన విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులను విడుదల చేయాలని పోలీసులతో మాట్లాడారు.