చలో ఢిల్లీ: నాయకత్వ మార్పా, వైయస్ జగన్ పై చర్యలా?
రాష్ట్ర గవర్నర్ నరసింహన్, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా ఢిల్లీలో ఉంటున్నారు. ఈ స్థితిలో రాష్టంలో నాయకత్వ మార్పుపై కూడా కాంగ్రెసు అధిష్టానం దృష్టి పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. రోశయ్య స్థానంలో బలమైన నాయకుడిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతారనే వార్తలు వస్తున్నాయి. రోశయ్య ప్రస్తుత స్థితిలో ముఖ్యమంత్రిగా కొనసాగడానికి ఇష్టపడడం లేదని అంటున్నారు. తనకు పూర్తి స్వేచ్ఛనివ్వాలని ఆయన అడుగుతున్నట్లు సమాచారం. ఈ స్థితిలో మంత్రివర్గ మార్పులకు పచ్చ జెండా ఊపి రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగించే విషయంపై కూడా చర్చలు జరుగుతాయని అంటున్నారు. తాజా పరిణామాలపై నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. నరసింహన్ నివేదిక ఆధారంగానే రాష్ట్రంలోని పరిస్థితులపై కాంగ్రెసు అధిష్టానం ఓ అభిప్రాయానికి వచ్చి చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.
వైయస్ జగన్ పై చర్యలు తీసుకోవడం, చిరంజీవిని మంత్రివర్గంలో చేర్చుకోవడం వంటి పరిణామాలతో పాటు ముఖ్యమంత్రి మార్పు కూడా అధిష్టానం ఎజెండాలో ఉండవచ్చునని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా, మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణపై చర్చలు జరుగుతాయని చెబుతున్నారు. భవిష్యత్తు పరిణామాలను ఎదుర్కోవడానికి అనువైన చర్యలకు కాంగ్రెసు అధిష్టానం శ్రీకారం చుడుతుందని, అందుకే ముఖ్యమైన నేతలను ఢిల్లీకి పిలిపించిందని అంటున్నారు.