అధిష్టానంపై వైయస్ జగన్: నిప్పులు సోనియాకు బహిరంగ లేఖ
తన తండ్రి వైయస్సార్ పార్టీ కోసం జీవితాన్ని అంకితం చేశారని, అటువంటి పార్టీ నుంచే తాను వెళ్లిపోవాల్సి వస్తున్నందుకు బాధపడుతున్నానని ఆయన అన్నారు. వైయస్సార్ కు ఇచ్చిన మాట కోసమే తాను ఓదార్పు యాత్ర చేపట్టానని, ఓదార్పు యాత్రకు లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేకపోయారని, దాంతో దుష్ప్రచారం మొదలు పెట్టారని ఆయన అన్నారు. తనకు పార్టీ నుంచి వెళ్లిపోవడం తప్ప మరో మార్గం లేదని ఆయన అన్నారు. సాక్షి కాంగ్రెసు పార్టీకి చెందిన పత్రిక కాదని తాను స్పష్టం చేశానని, దానిలో వచ్చిన వార్తాకథనాలను సాకుగా చూపి తనపై కుటిల రాజకీయాలకు పూనుకున్నారని ఆయన అన్నారు.
రోశయ్యను ముఖ్యమంత్రిగా చేయాలని అనుకున్నప్పుడు తాను ప్రతిపాదన చేశానని, కిరణ్ కుమార్ రెడ్డిని సిఎల్పీ నేతగా ఎంపిక చేసే సమావేశంలో కూడా సహకరించామని, తాను ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నిస్తున్నానని తప్పుడు ప్రచారం చేశారని ఆయన అన్నారు. సాక్షి విలువల కోసమే నిలబడిందని, అందుకనే దాని సర్క్యులేషన్ పెరిగిందని, ఆ విలువల కోసమే సాక్షి నిలబడుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వాన్ని కూల్చడానికి పూనుకున్నానని తన వ్యక్తిత్వాన్ని ఖననం చేసే పనికి పూనుకున్నారని ఆయన అన్నారు. తాను చంద్రబాబులాగా కుట్రలు చేయలేదని ఆయన అన్నారు. విలువలు దిగజార్చే విధంగా తాను వ్యవహరించలేదని, వ్యవహరించబోనని ఆయన అన్నారు. 165 మంది శాసనసభ్యులు తనకు మద్దతిచ్చినా అధిష్టానం మాటకు కట్టుబడి పని చేశామని, రోశయ్య పేరును తాను ఉన్నత విలువల కోసం ప్రతిపాదించానని ఆయన అన్నారు.