కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోతుందంటున్న వైయస్ జగన్ క్యాంప్

కొద్ది రోజుల్లోనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూలిపోతుందని సినీ నటి, వైయస్ జగన్ వర్గం నాయకురాలు రోజా అన్నారు. ఈ విషయాన్ని గ్రహించి బయటకు వచ్చినవారు సురక్షితంగా ఉంటారని, అలా గ్రహించనివారు శిథిలాల కింద నలిగిపోతారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం జగన్ కు లేదని, తన తండ్రి వల్ల ఏర్పడిన ప్రభుత్వమని, అందువల్ల అది సాగాలని జగన్ కోరుకుంటున్నారని ఆయన అన్నారు. ఇలా పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూనే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం, అందులో తమ ప్రమేయం లేదని చెప్పడం వైయస్ జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.
కాగా, వైయస్ జగన్ వర్గానికి చెందిన సాక్షి దినపత్రిక పతాక శీర్షికన ప్రచురించిన సాక్షి వార్తాకథనం కిరణ్ మంత్రివర్గ అసంతృప్తి రగులుతూనే ఉందని వ్యాఖ్యానించింది. అధిష్టానం జోక్యంతో మంత్రులు వెనక్కి తగ్గినప్పటికీ లోలోన రగిలిపోతున్నారని వ్యాఖ్యానించింది. అది భగ్గుమనక తప్పదనే రీతిలో వార్తాకథనం వ్యాఖ్యానం ఉంది. కాగా, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తామని బహిరంగంగానే ప్రకటించారు. కాంగ్రెసులో ఉంటే తాను వైయస్ జగన్ తో కలిసి పని చేసి ఉండేవాడినని, కిరణ్ కుమార్ ప్రభుత్వం పడిపోవడానికి అన్ని శక్తులకూ సహకరిస్తానని, ఆ ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని అన్నారు.












Click it and Unblock the Notifications