కోస్తాంధ్రలో భారీ వర్షాలకు 37 మంది మరణం

పంట చేతికందే సమయంలో కళ్ల ముందే ముంపు పాలవడాన్ని తట్టుకోలేక కాకుమాను మండలం వల్లూరుకి చెందిన గరికపాటి విజయలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందారు. పిట్టలవానిపాలెం మండలం జి.ఎన్.పాలెంకు చెందిన మహిళా రైతు పిన్నిబోయిన అనసూయమ్మ గుండెపోటుతో మృతి చెందారు. సంతనూతపాడు మండలం మైనంపాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులు ముదిగుండవాగును దాటుతూ గల్లంతయ్యారు. నెల్లూరుజిల్లా వెంకటాచలం మండలంలో ఇద్దరు పిల్లలు నీటిగుంటలో పడి మృతి చెందారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం కిష్టాపురం గ్రామానికి చెందిన మర్రి సైదులు (48) తన పొలంలో ధాన్యం వర్షానికి తడిసి మొలకలు రావడంతో తీవ్ర వేదనకు గురయ్యాడు. ఇటీవల అతను 6 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు రావడంతో గుండెపోటుతో మృతి చెందాడు.
వాయుగుండం ప్రభావానికి శ్రీకాకుళం జిల్లా కూడా అతలాకుతలమైంది. జిల్లా వ్యాప్తంగా 115 ఇళ్లు పాక్షికంగా, 8 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. టెక్కలి, నందిగాం మండలాల్లో వంశధార ప్రధాన కాలువకు మూడుచోట్ల భారీ గండ్లు పడ్డాయి. రణస్థలం మండలంలో అయిదు చెరువులకు గండ్లు పడ్డాయి. జి.సిగడాం మండలంలో కొత్తగా తవ్వుతున్న తోటపల్లి కాలువకు కూడా గండిపడింది. రణస్థలం మండలంలో పాతర్లపల్లి వద్ద, కోటపాలెం భద్రమహంకాళీ గుడి వద్ద, నారువ సమీపంలో గెడ్డల వద్ద నీటి ప్రవాహం ఉద్ధృతంగా ఉండటంతో 20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లావేరు మండలం బుడుమూరు గెడ్డ పొంగుతోంది. దీనివల్ల 18 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ప్రకాశం జిల్లాలో చలిగాలులకు ముగ్గురు చనిపోగా మద్దిపాడు మండల పరిధి సీతారాంపురం, గురవారెడ్డిపాలెం గ్రామాల మధ్య ముదిగుండ వాగును ద్విచక్ర వాహనంపై దాటుతున్న ఇద్దరు యువకులు గల్లంతయ్యారు.












Click it and Unblock the Notifications