వైయస్ జగన్ ను టార్గెట్ చేసుకున్న అన్ని పార్టీల నాయకులు

బెంగళూరు నుంచి కొత్తగా వచ్చిన జగన్కు రాష్ట్రం గురించి ఏం తెలుసని కాంగ్రెసు మధుయాష్కీ ప్రశ్నించారు. కన్నతల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పొడుస్తారా, మద్దతిస్తారా అన్నది జగన్కే తెలియాలని ఆయన అన్నారు. వైయస్ జగన్ దీక్షకు వెళ్లిన శాసనసభ్యులపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని వైయస్ జగన్ అనడాన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని విమర్శించడం తల్లిని విమర్శించడం లాంటిదని ఆయన అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతాయని ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్లో ఉన్నందుకు సిగ్గు పడుతున్నానన్న కడప మాజీ ఎంపీ వైఎస్ జగన్పై ఏఐసీసీ కార్యదర్శి పొంగులేటి సుధాకర్రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకు సిగ్గు పడుతున్నారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సిగ్గుమాలిన పనులేవీ రాష్ట్ర ప్రభుత్వం చేయలేదని తెలిపారు. ఎవరికి డిపాజిట్లు వస్తాయో, ఎవరికి రావో 2014 ఎన్నికల్లో తేలుతుందని వ్యాఖ్యానించారు. జగన్ దీక్షలో పాల్గొంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు.
రైతు సమస్యలపై వైయస్ జగన్ కు అవగాహన లేదని తెలుగుదేశం నాయకుడు కడియం శ్రీహరి అన్నారు. ముఖ్యమంత్రి పీఠాన్ని లక్ష్యంగా పెట్టుకుని వైయస్ జగన్ దీక్ష చేస్తున్నారని ఆయన విమర్శించారు. వైయస్ జగన్ లక్ష్యదీక్షకు వెళ్లిన తమ శాసనసభ్యులపై ప్రజారాజ్యం పార్టీ నాయకుడు సి. రామచంద్రయ్య తీవ్రంగా ప్రతిస్పందించారు. శాసనసభా సభ్యత్వాలకు రాజీనామా చేసి వైయస్ జగన్ దీక్షకు వెళ్లాలని ఆయన సూచించారు. ప్రజారాజ్యం పార్టీ శాసనసభ్యులు శోభానాగిరెడ్డి, కాటసాని రామిరెడ్డి వైయస్ జగన్ దీక్షకు హాజరైన విషయం తెలిసిందే. చిరంజీవి అడిగితే తాము వివరణ ఇస్తామని జగన్ దీక్షలో పాల్గొన్న ప్రజారాజ్యం పార్టీ నాయకుడు భూమా నాగిరెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications