సెటిల్ మెంట్ల దందాకు పేరు మోసిన మద్దెలచెర్వు సూరి
వెన్నునొప్పి పేరుతో సూరి జైలు నుంచి నిమ్స్కు తరచూ రాకపోకలు సాగించారు. ఈ సమయంలో అనుచరులద్వారా స్థల యజమానులను ఆసుపత్రికి పిలిపించి దందాలు నెరపేవారని ఆరోపణ. 2009 నవంబరు, డిసెంబరు మాసాల్లో ఏకంగా 40 రోజులపాటు సూరి నిమ్స్లోని మిలీనియం బ్లాకులో ఉన్నాడు. అతడితోపాటు గన్మెన్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బంది కోసం 220, 221 నెంబర్లు గల గదులను కేటాయించారు. ఉదయం వేళల్లో సాధారణంగా చికిత్స పొందుతున్నట్లుగా ఉండే సూరి రాత్రివేళల్లో ఆసుపత్రి కేంద్రంగా పనులన్నీ చక్కబెట్టుకునేవాడని సమాచారం. ఈ సమయంలో కొందరు ప్రముఖులను సైతం ఆయన కలిసేవారని, ఇందులో భాగంగా భారీస్థాయిలో సెటిల్మెంట్లు జరిగేవనే విమర్శలున్నాయి. సెటిల్మెంట్లలో అనుచరులు మధుసూధనరెడ్డి, భానుప్రసాద్ కీలక పాత్ర పోషించేవారని సమాచారం.
నిరుడు కేపీహెచ్బీ కాలనీ పరిధిలో 654 చదరపు గజాలున్న ఒక స్థలాన్ని వీరు కబ్జా చేశారు. ఆ స్థలం ప్రముఖ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఓ డాక్టరుకు చెందినది. సూరి అనుచరులుగా చెప్పి ఆక్రమించుకోవడంతో ఆమె కేపీహెచ్బీ పోలీసులకు ఫిర్యాదు చేయగా అనుచరులు నలుగురిపై కేసు (నెంబరు 469/10) నమోదైంది. ఇద్దరు లొంగిపోగా భాను, మధు పోలీసుల ఎదుటకు రాలేదని తెలిసింది. అయితే సూరి హత్య సమయంలో వీరిద్దరూ కారులో ఉండటం గమనార్హం. విజయవాడ, విశాఖల్లో జరిగిన భూ దందాల్లో సూరికీ ప్రమేయం ఉందన్న విమర్శలు వినిపించాయి. విజయవాడలో ఒక కేసూ నమోదైంది. రియల్ వ్యాపారంలో ఉన్న తెదేపా నేత ఒకరు బహిరంగంగానే సూరిపై ఆరోపణలూ చేశారు. ఇటీవల పుట్టపర్తిలో ఒక రియల్ వ్యాపారిని బెదిరించినట్లూ కేసు నమోదైంది.