వైయస్ జగన్ ఢిల్లీ దీక్ష బలప్రదర్శన కాదు: అంబటి రాంబాబు
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ నెల11న జగన్ నేతృత్వంలో దీక్ష ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. ఈ ఆందోళన కృష్ణా నదీ జలాలపై ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా కాదని ఆయన స్సష్టం చేశారు. కృష్ణా డెల్టాలోని రైతుల కష్టాలను, వారి భయాందోళనను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వివరించారు. కేంద్ర జల పంపిణీ విధానం సక్రమంగా లేనందునే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన అన్నారు.
ఢిల్లీ రావడానికి చాలా మంది నేతలు, రైతులు ఆసక్తి చూపుతున్నారని అంబటి తెలిపారు. అయితే ఢిల్లీకి అందరిని తీసుకువెళ్లడం సాధ్యం కాదని ఆయన చెప్పారు. పరిస్థితిని అర్ధం చేసుకోవాలని ఆయన కోరారు. ప్రత్యేక రైలులో ఎన్నికైన సభ్యులు మాత్రమే రావాలని అంబటి కోరారు. ఢిల్లీలో చలి ఎక్కువగా ఉంటుందని, రైలులో వచ్చేవారు రగ్గులు, స్వెట్టర్లు తెచ్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు.
చంద్రబాబు హయాంలో కృష్ణానదిపై ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడి ఉండేది కాదన్నారు. 9 ఏళ్లపాటు చంద్రబాబు ప్రాజెక్టులు ఏమీ నిర్మించకుండా నిద్రపోతున్నందునే ఈ పరిస్థితి తలెత్తిందని అంబటి విమర్శించారు.