వైయస్ జగన్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వెనక్కి పోయిందా?
తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే తాము ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి ఉండదని, తమకు పుట్టగతులుండవని తెలంగాణ శానససభ్యులు, పార్లమెంటు సభ్యులు కాంగ్రెసు అధిష్ఠానం వద్ద కాళ్లావేళ్లా పడినట్లు తెలుస్తోంది. ముందు పార్టీ అధికారంలో ఉండేలా చూసుకోవాలి కదా, అధికారంలో లేకపోయిన తర్వాత మీరు ప్రజల్లోకి వెళ్తే ఏమిటి, లేకుంటే ఏమిటి అని పార్టీ అధిష్టానం పెద్దలు వారితో అన్నట్లు సమాచారం. పార్లమెంటు సభ్యుల సంఖ్య చూసినా, శాసనసభ్యుల సంఖ్య చూసినా సీమాంధ్రదే అగ్రస్థానం కాబట్టి ప్రభుత్వాలను కాపాడుకోవడానికి వారి మద్దతు అనివార్యమని కాంగ్రెసు అధిష్టానానికి చెందిన నాయకులు అంటున్నట్లు చెబుతున్నారు. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వాలను కూల్చడానికి ఏ మాత్రం వెనకాడకూడదని, అందుకు వైయస్ జగన్ను వాడుకోవాలని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం కాంగ్రెసులోని పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు తగిన వ్యూహాన్ని వైయస్ జగన్ అనుసరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే, తెలంగాణ అనుకూలంగా వైయస్ జగన్ వర్గానికి చెందిన కాంగ్రెసు శాసనసభ్యురాలు కొండా సురేఖ తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నట్లు విశ్లేషిస్తున్నారు. ఇటలీ పుట్టిన సోనియాకు తెలంగాణ ప్రజల మనోభావాలు ఏం తెలుసునని, సోనియా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణ పార్లమెంటు సభ్యులు, శానససభ్యుల నుంచి అధిష్టానంపై ఎంత ఒత్తిడి పెరిగితే అంతగా తాము లాభపడుతామని వైయస్ జగన్ వర్గం భావిస్తోంది. ఇటు తెలంగాణ శాసనసభ్యులు రాజీనామాల బాట పట్టినా తమకు పరిస్థితి అనుకూలంగా మారుతుందని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకుంటే మాత్రం తాము నేతి బుట్టలో పడుతామనే ఉద్దేశంతో వైయస్ జగన్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎటు చూసినా వైయస్ జగన్ ప్రయోజనం పొందే పరిస్థితి ఉన్నప్పటికీ తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుని ప్రభుత్వాన్ని పడగొట్టుకోవడం ఎందుకనే భావనతో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు చెబుతున్నారు.