హైకమాండ్కు కాంగ్రెసు తెలంగాణ నేతల హెచ్చరిక, సమావేశంలో గొడవ

వైయస్ జగన్ దీక్షకు వెళ్లినవారికి లేని హైకమాండ్ తమకే ఉందా అని నల్లగొండ జిల్లా భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. అవసరమైతే తెలంగాణ కోసం తాము రాజీనామాలకు కూడా సిద్ధమని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం ఖాయమని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తాము 11 మంది పార్లమెంటు సభ్యులం ఓ శక్తి అని ఆయన అన్నారు.
తాము లేకపోతే కాంగ్రెసు పార్టీ లేదని కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్నారు. వైయస్ జగన్ వెంట వెళ్లిన శాసనసభ్యులకు ఓ న్యాయం తమకు మరో న్యాయమా అని ఆయన అడిగారు. పార్టీలో లేని వైయస్ జగన్తో కాంగ్రెసు శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వెళ్లారని ఆయన అన్నారు. తాము పార్టీ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన అన్నారు. కాగా, కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకుల సమావేశంలో తీవ్రమైన గొడవ జరిగింది.
ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులు సమావేశానికి వచ్చి సభలో గొడవ చేశారు. కాంగ్రెసు తెలంగాణ ప్రాంత ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి కె. జానారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ గురించి మాట్లాడని నాయకుల వద్దకు వెళ్లి నిలదీయాలని వారికి పొన్నం ప్రభాకర్, శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డి సూచించారు. కాసేపటికి గొడవ సద్దుమణిగింది.












Click it and Unblock the Notifications