వైయస్సార్ తోడల్లుడితో భాను లింక్స్: వైయస్ హయాంలోనే నడిచిన కథ?
భాను కిరణ్తో పాటు భూమి కొనుగోలు చేసిన అబ్బిరెడ్డి మల్లికార్జున రెడ్డి వైఎస్ రాజశేఖర్రెడ్డికి సమీప బంధువని, వైఎస్ భార్య విజయలక్ష్మి, మల్లికార్జున రెడ్డి భార్య వరుసకు అక్కాచెల్లెళ్లని, వైఎస్ సీఎం కాకముందు వల్లూరు మండలం దుగ్గాయపల్లెలో ఆ సాధారణ కుటుంబానికి చెందిన సగటు వ్యక్తి అబ్బిరెడ్డి అని, నాలుగేళ్లుతిరిగేసరికి కోటీశ్వరుడైపోయాడని, ఇటీవల కడపలో ఆయననిర్మించుకున్నఇంద్రభవనంగృహప్రవేశానికి వైయస్ జగన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారని ఆంధ్రజ్యోతి దినపత్రిక రాసింది. ఇంత తక్కువ కాలంలో అబ్బిరెడ్డి అంత ఎలా సంపాదించాడనే ప్రశ్న వేసి, దానికి కూడా సమాధానం చెప్పేందుకు పత్రిక ప్రయత్నించింది. ఆ వార్తాకథనం ప్రకారం- మంగలి కృష్ణది పులివెందుల. గతంలో వైఎస్ వద్ద ఉండేవారు. ఇప్పుడు ఆయన కుమారుడి వ్యవహారాలు చక్కబెడుతున్నారని సమాచారం. మరో కీలక వ్యక్తి శ్రీకాంత్ గౌడ్న్యాయవాది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి భిక్షపతి గౌడ్కు అల్లుడు. వీరు, మరికొందరు కలిసి అనేక డీల్స్ చేశారు. అన్నీ కోట్లలోనే. కానీ విలువ వందల కోట్లలో. ఇవన్నీ వైఎస్ ప్రాభవం నడుస్తున్న 2004-08 మధ్య జరిగినవేనట.
ఆ లావాదేవీలు ఇలా జరిగాయట - వివాదంలో ఉన్న భూమి గురించి తెలియగానే భాను-అబ్బిరెడ్డి టీమ్ అక్కడ దిగుతుంది. వివాదాస్పద భూ యజమానికి కొంత ముట్టజెప్పి జీపీవో రాయించేసుకుంటారు. అక్కడ వైఎస్ తోడల్లుడి అధికార బలం.. శ్రీకాంత్ గౌడ్ న్యాయ పరిజ్ఞానం ఉపయోగపడతాయి. ఆ తర్వాత ఆ స్థలాన్ని అమ్మేసుకుంటారు. రియల్ బూమ్లో భారీ సెటిల్మెంట్లు చేసిన సూరి గ్యాంగ్ ఆపై బూమ్ పడిపోవటంతో చిన్నాచితకా సెటిల్మెంట్ల నుంచి కార్పొరేట్, టాలీవుడ్ సెటిల్మెంట్లపై దృష్టిని సారించారు. ఇదే బెజవాడలో బయటపడింది. భాను ప్రయివేట్ సంపాదన, అతని వ్యవహారాలు, వైఎస్ బంధువులతో సాన్నిహిత్యం సూరి దృష్టికి ఇటీవల వచ్చినట్టు సమాచారం. ఈ క్రమంలోనే భానుకిరణ్ను తన ఆస్తులను స్వాధీనం చేయాల్సిందిగా సూరి గట్టిగా చెప్పినట్టు తెలిసింది. దీంతో భాను తన పేర ఉన్న ఆస్తులను రక్షించుకోవాలని నిర్ణయించుకున్నాడు. హైదరాబాద్లో తన ప్లాన్ను పక్కాగా పూర్తి చేసి అదృశ్యమయ్యాడు.
"శ్రీకాంత్ గౌడ్ అనే అడ్వొకేట్ వద్ద లీగల్ ఒపీనియన్ చెప్పేవాడు. ఆయనే భానును పరిచయం చేశాడు. 2008లో ఒక భూమిని లీగల్గా పరిష్కరించుకుంటే మంచిదని ఆయన సలహా ఇవ్వడంతో భాగస్వామిగా చేరాను. ఆయనతో కలిసి చేసిన రెండు డీల్స్.. ఇంకా కోర్టుల్లోనే ఉన్నాయి. ఆ తర్వాత దానిని వదిలేశాం. పెట్టుబడిని కూడా వదిలేశాం. ఆ తర్వాత భానుకు నాకు సంబంధాల్లేవు. ఆయన సూరి అనుచరుడని కూడా నాకు తెలియదు. గతంలో అతడు మామూలుగా కడపలో తిరుగుతుండటమే నాకు తెలుసు'' అని వైఎస్ బంధువు అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది.