శ్రీకృష్ణ కమిటీ నివేదికపై కాంగ్రెసు పార్టీ విధానం వెల్లడిస్తాం: ముఖ్యమంత్రి
కిరణ్ శుక్రవారం ఉదయం కేంద్ర హోం మంత్రి చిదంబరాన్ని కలిసి సుదీర్ఘంగా చర్చించారు. ఆ తర్వాత ప్రధాని మన్మోహన్, కేంద్ర న్యాయ శాఖ మంత్రి వీరప్ప మొయిలీలతో భేటీ అయ్యారు. సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్ పటేల్తో సమావేశమయ్యారు. తర్వాత కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి నివాసానికి వెళ్లి సుదీర్ఘంగా మాట్లాడారు. రాత్రి తొమ్మిదిన్నరకు పార్టీ ముఖ్యనేత ప్రణబ్ ముఖర్జీతో, మరో సీనియర్ నేత ఏకే ఆంటోనీతో భేటీ అయ్యారు. సీఎం శనివారం సోనియాతో సమావేశమయ్యే అవకాశముంది. ఈ సమావేశాల్లో శ్రీకృష్ణ కమిటీ నివేదిక చుట్టూనే చర్చ సాగింది. నివేదిక బహిర్గతమైన నాటినుంచి ఇప్పటివరకూ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రాజకీయ పార్టీల స్పందనలపై తమ పార్టీ పెద్దలకు ముఖ్యమంత్రి నివేదించినట్లు తెలిసింది. ఎలాంటి ముందడుగు వేస్తే బాగుంటుందనేదానిపైనా ఆయన తన అభిప్రాయాన్ని చెప్పినట్లు సమాచారం అందింది. శుక్రవారం ఉదయం ఢిల్లీలో దిగిన ముఖ్యమంత్రిని ఏపీ భవన్లో చాలా మంది ఎంపీలు కలిశారు.