గవర్నర్ భరద్వాజ్ పై బిజెపి ఆగ్రహం, రాష్ట్ర బంద్: పలు చోట్ల హింస
రాష్ట్రవ్యాప్తంగా తాము బస్సులను రద్దు చేశామని కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అధికార ప్రతినిధి చెప్పారు. శుక్రవారం రాత్రి బస్సులపై రాళ్లు రువ్విన సంఘటనలు జరిగినప్పటికీ బెంగళూర్లో బస్సులు నడుపుతున్నామని బెంగళూర్ మెట్రోపాలిటన్ రవాణా సంస్థ తెలిపింది. అయితే, బస్సు సౌకర్యాలు సరిగా లేక బెంగళూర్ పౌరులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కార్యాలయాలకు చేరుకోవడానికి వారు తీవ్ర ఇక్కట్ల పాలయ్యారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బెంగళూర్లో 18 వేల మంది పోలీసులను నియోగించారు. యడ్యూరప్ప సొంత జిల్లా షిమోగాలో ఆందోళనకారులు అర గంటపాటు రైళ్లను ఆపేశారు.
కాగా, యడ్యూరప్ప రాజీనామా చేసే ప్రసక్తే లేదని బిజెపి తేల్చి చెప్పింది. గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజకీయంగా, న్యాయపరంగా పోరాటం చేస్తామని బిజెపి ప్రకటించింది. యడ్యూరప్ప ప్రాసిక్యూషన్కు అనుమతించడం రాజ్యాంగవిరుద్ధమని, రాజకీయ దురుద్దేశంతో కూడిందని విమర్శించింది. ఇదిలా వుంటే, గవర్నర్ నిర్ణయాన్ని కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం సమర్థించారు. ముఖ్యమంత్రి ప్రాసిక్యూషన్కు ఓ గవర్నర్ అనుమతించడం ఇదే మొదటిసారి కాదని, ఇంతకు ముందు ఆలాంటివి జరిగాయని ఆయన అన్నారు.